ఏ సర్వేనెంబర్లో.. ఏ రైతు.. ఏ పంట సాగు చేస్తున్నాడనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన వానకాలం పంటల సర్వే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చివరిదశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మండల వ్యవసాయాధికారులు సర్వే నెంబర్ ఆధారంగా పక్కా సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, జలవనరులు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో 7,31,447 ఎకరాల్లో పంటల సాగు చేస్తుండగా, ఇప్పటికే 85 శాతం సర్వే పూర్తయింది. అత్యధికంగా 3,48,946 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మెదక్ జిల్లాలో 3,43,539 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా, 95.48శాతం అంటే 3,28,007 ఎకరాల్లో సర్వే చేశారు. ఈ వివరాలు, ఫొటోలతో సహా ఎప్పటికప్పుడు రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో లక్ష్యం మొత్తం పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
-మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, సెప్టెంబర్ 7
ఏయే జిల్లాలో ఎంత భూమి సాగులో ఉన్నది. ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు సేకరించి, అందుకనుగుణంగా ఏ పంట ఎంత దిగుపడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. దానికి ఆధారంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నది. ఈ ఏడాది ఏఈవోలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు.
మెదక్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పంటల సాగు వివరాలు పకాగా తెలుసుకునేందుకు చేపట్టిన సర్వే మెదక్ జిల్లాలో చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే 95.48 శాతం పూర్తయ్యింది. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోని పొలాల వెంట తిరుగుతూ క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 21 మండలాలు 469 పంచాయతీల్లో 76 క్లస్టర్ పరిధిలోని 76 మంది ఏఈవోలు, 21 మంది ఏవోలు పని చేస్తున్నారు. పొలాలకు వెళ్లి పంటల వివరాలు నమోదు చేసే పనిని విసృ్తతంగా చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 3,43,539 ఎకరాలకు ఇప్పటివరకు 3,28,007 ఎకరాల్లో సర్వే చేసి వివరాలు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధితో పాటు తూప్రాన్ రెవెన్యూ డివిజన్లోని 21 మండలాల రైతులు ఇప్పటివరకు 3.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో వరి 2.99 లక్షల ఎకరాలు, పత్తి 38 వేలు, మొకజొన్న 3,499, కందులు 1,069, పెసర్లు 976, మినుములు 257 ఎకరాలతో పాటు ఇతర పంటలు 22 వేల ఎకరాల్లో సాగుచేశారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్7: సంగారెడ్డి జిల్లాలో 7,31,447ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో అత్యధికంగా పత్తిని 3,48,946 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో 85 శాతం పంటల సాగు వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేశారు. జిల్లాలో అత్యధికంగా పత్తిని 3,48,946 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వరి 1,36,308 ఎకరాలు, కంది 80,173 ఎకరాలు, సోయాబీన్ 78,818 ఎకరాలు, చెరుకు 16,498 ఎకరాలు, మొక్కజొన్న 13,009 ఎకరాలు, జిలుగ 12,841 ఎకరాలు, పెసర 9,527 ఎకరాలు, చెరుకు మొడెం 7,105 ఎకరాలు, మిను ము 6,408 ఎకరాలు, జొన్న 653 ఎకరాలు, జనుము 2,468 ఎకరాల్లో పండిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగు వివరాలను ఆయా గ్రామాల్లో సర్వే చేసి సేకరిస్తున్నారు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 85 శాతం సర్వే పూరైంది. మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఉద్యానశాఖ పరిధిలో ఉండే పంటల వివరాలను సర్వే చేసి పంటల విస్తీర్ణాన్ని తేల్చనున్నారు. దీంతోపాటు కూరగాయలు, పండ్ల తోటల సాగు వివరాలు సేకరించనున్నారు.
పంటల సర్వే చివరి దశలో ఉన్నది. ఏఈవోలు పొలాలకు వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 95.48 శాతం పూర్తిచేశాం. సాగు వివరాలను యాప్లో నమోదు చేయడంతో పంట దిగుబడిలో ధాన్యాన్ని అమ్మకానికి తీసుకెళ్లే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఎం.గోవిందు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్
జిల్లావ్యాప్తంగా పంటల వివరాలు సేకరణ తుదిదశకు చేరింది. పంట వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తున్నాం. ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం పంటల వివరాలను క్షేత్రస్థాయి నుంచే సర్వే చేయిస్తున్నది.
– నర్సింహారావు, -జిల్లా వ్యవసాయధికారి, సంగారెడ్డి