రామాయంపేట, జూలై 23: హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పొలం గట్లపై రైతులు టేకు మొక్కలు నాటారు. రైతులు తాము వేసుకున్న పంటల్లోని పొలం గట్లపై వీటిని నాటడంతో అవి ప్రస్తుతం పెరిగి వృక్షాలుగా మారాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట ఉమ్మడి మండలంలోని కాట్రియాల, పర్వతాపూర్, తొనిగండ్ల, లక్ష్మాపూర్, దంతెపల్లి, నస్కల్, రాంపూర్ కల్వకుంట, నందిగామ, బచ్చరాజుపల్లె, నగరం, నందగోకుల్ తదితర గ్రామాల్లో రైతులకు ప్రభుత్వ అధికారులు నాల్గో విడత హరితహారంలో ఉచితంగా అందజేసారు. దీంతో రైతులు తమ పంటలతో బాటు టేకు చెట్లను కూడా పొలం గట్లపై పెంచుతున్నారు. పొలం గట్లపైనే కాకుండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఇతర కార్యాలయాల వద్దకూడా గతంలో మొక్కలను నాటారు. నిజాంపేట మండల కేంద్రంలోని విద్యార్థుల వసతి గృహం వద్ద నాటిన టేకు మొక్కలు నేడు గార్డెన్లా తలపిస్తున్నాయి. ప్రతిరోజు హాస్టల్లో చదువుకునే చిన్నారులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ప్రవేపెట్టి ఉపాధి కల్పిస్తుండడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాలకు తొమ్మిదో విడత హరితహారంలో ముందుగా టేకు మొక్కలను అంద జేస్తున్నాం. రైతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో కూడా టేకు మొక్కలు నాటేలా తమ ఉపాది సిబ్బంది చర్యలు చేపట్టి నాటించారు. ఇప్పుడు అవి పెరిగి పెద్దగా మారాయి. ఇప్పటికి ఐదు విడతలుగా టేకు మొక్కలను ప్రత్యేకించి అందజేస్తున్నాం. రైతులు ఎక్కవ శాతం తమ పొలం గట్లపై నాటుకుని వాటి ద్వారా ఉపాది కూడా పొందుతున్నారు.
టేకు మొక్కలు ఆదాయాన్ని ఇస్తున్నాయి. పొలం గట్లపై నాల్గో విడతలో నాటిన మొక్క నేడు పెద్ద చెట్టుగా మారింది. పొలానికి పారించిన నీటితోనే మొక్క పెరిగింది, మొక్కకు ఎలాంటి రసాయనాలు కూడా వేయలేదు. తమ పంట పొలంతోపాటు టేకు మొక్కలు కూడా ఆదాయాన్ని ఇస్తున్నాయి.