సిద్దిపేట అర్బన్, మార్చి 26: ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఇతర అధికారులకు సూచించారు. మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి మండలంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని.. మిగతా కొనుగోలు కేంద్రాలు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా ఉంచాలని, ధాన్యం ఇతర రాష్ర్టాల నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో మున్సిపల్ ఇంజినీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు సమన్వయంతో తాగునీరు సక్రమ సరఫరా చేయాలని, నీటి లభ్యత, సరఫరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారుల క్షేత్ర స్థాయి పర్యవేక్షణతో తాగునీటి సమస్యను అధిగమించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అధికారులు పాల్గొన్నారు.