పాపన్నపేట, నవంబర్ 27: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సారశ్రీనివాస్, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్కుమార్, నర్సింలు, వరుణాచారి తదితరులతో పాటు పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకర్శర్మ, పార్థీవశర్మ, రాజశేఖర్శర్మ, నాగరాజుశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ బందోబస్తు చేపట్టారు.
అమ్మవారిని దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్
ఏడుపాయల వనదుర్గాభవానీమాతను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు. అంతకుముందు సునీత లక్ష్మారెడ్డికి ఆలయ మర్యాదల ప్రకారం రాజగోపురం నుంచి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.