సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 29 : రైతులకు పంట రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో పంట రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీపై అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీజీవీబీ బ్యాంకులో 6వేల మంది రైతులకు రూ.40కోట్లు, ఎస్బీఐలో 4 వేల మంది రైతులకు రూ.25 కోట్లు, యూబీఐ బ్యాం కులో 2,500 మంది రైతులకు రూ.17కోట్లు, ఇతరత్రా బ్యాంకుల్లో సుమారు 3,500 మంది రైతులకు రూ.35 కోట్ల పెండింగ్ పంట రుణమాఫీ నగదును రైతులకు అందజేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఇప్పటి వరకు జిల్లాలో 1,72,592 మంది రైతులకు రూ.1,321కోట్లు మంజూరు కాగా, 81,237 మంది రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ రూ.440.18 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 59,712 మంది రైతులకు రూ.343.39 కోట్లు నగదు రూపంలో రైతులు వారి ఖాతా నుంచి తీసుకున్నట్లు చెప్పా రు. మిగతా 21వేల మంది రైతుల క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఏడీఏ, ఏవోలు బ్యాం కర్ల దగ్గర నుంచి వివిధ గ్రామాల్లో పెండింగ్ జాబితాను తీసుకోవాలన్నారు. బ్యాంకు మేనేజర్లు, ఆర్ఎంలు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని ఎల్డీఎంకు తెలిపారు.
కొత్త రుణాలు తీసుకునే అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి రుణాలకు సంబంధిత విషయాలను వివరించాలన్నారు. గ్రామాల్లోని రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి క్రాప్లోన్ తీసుకునేలా రైతులకు ప్రేరణ కల్పించాలన్నారు. ఎస్బీఐ, యూబీఐ, ఏపీజీవీజీ, కోఆపరేటివ్ బ్యాంకులు రోజు 100 చొప్పున రుణాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రెండో విడత వీధి వ్యాపార రుణాలను మున్సిపాలిటీ పరిధిలో 1,384 మందికి వారం రోజుల్లో మెప్మా అధికారుల సహాయంతో బ్యాంకు మేనేజర్లు అందించాలని ఆదేశించారు.
ఆహార ఉత్పత్తి పీఎంఎఫ్ఎంఈ పరిధిలో గల 87 యూనిట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. ట్రైకర్ లోన్ పెండింగ్లో ఉన్న 10 రుణాలు, 118 ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వారంలోగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ సత్యజిత్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, డీఏవో శివప్రసాద్, ఆర్ఎంలు, డీఆర్ఎంలు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.