సంగారెడ్డి, మార్చి 6: జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని గాయాలైన బాధితులకు ప్రథమ చికిత్స, అత్యవసర సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ను సంగారెడ్డి జిల్లా దవాఖానలో ప్రారంభించుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల, వసతి గృహ సముదాయాలకు భూమిపూజ చేశారు. ముందుగా మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని, ఈ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మెడికల్ కళాశాల విద్యార్థులతో చిట్చాట్ నిర్వహించిన అనంతరం నర్సింగ్ కళాశాల, వసతి గృహ సముదాయాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్తో ప్రమాద బాధితులకు గంటలోపే చికిత్సలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం జిల్లా దవాఖానలో అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన వసతులు లేకపోవడంతో హైదరాబాద్కు తరలించే క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఇక నుంచి జిల్లా వాసులకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి క్రిటికల్ కేర్ను ప్రారంభించామన్నారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు, వైద్య పరీక్షలు నిర్వహించడానికి రేడియాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేశామని వివరించారు. గర్భస్థ మహిళలకు అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. మెడికల్ కళాశాల విద్యార్థులు కోర్సు పూర్తి కాగానే, స్థానిక ప్రజలకే వైద్య సేవలు అందించాలని కోరారు. విద్యార్థులు దత్తత తీసుకున్న కుటుంబాలను సందర్శించి సభ్యుల్లో ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి, వాటికి అవసరమైన వైద్యసేవల గురించి వివరించాలన్నారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య సేవలను వివరించాలని సూచించారు.
రేడియాలజీ ల్యాబ్ రూ.1.38కోట్లు..
సంగారెడ్డి జిల్లా దవాఖానలో క్యాన్సర్ బాధితులకు వైద్య పరీక్షలు చేసేందుకు రూ.1.38 కోట్లతో ల్యాబ్ ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టంచేశారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు ల్యాబ్లో అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులకు కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి తెలుసుకునే విధంగా ల్యబ్లో పరీక్షలు జరుపుతారన్నారు. ల్యాబ్లో పరీక్షలు చేసుకున్న ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు.
మెడికల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసేందుకు పోలీస్ శాఖతో చర్చించి గుర్తు తెలియని మృతదేహాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం కళాశాలకు 9 మృతదేహాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తూ పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నర్సుల కోసం రూ.34 కోట్లతో నర్సింగ్ కళాశాలతో పాటు వసతిగృహం భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారన్నారు. నర్సింగ్ విద్యార్థులకు చదవుతో పాటు ఉండేందుకు వసతిగృహాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.
గౌరవవేతం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రూ.7 వేల నుంచి రూ.8 వేలకు అందజేస్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో గౌరవవేతనం మాటేలేదన్నారు. కానీ, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ.2 వేలు అందిస్తూ కంటితుడుపుగా నర్సులతో సేవలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సంగారెడ్డి పట్టణంలో 12వ వార్డులో రాజంపేట రోడ్డు నుంచి బైపాస్ రోడ్డుకు లింకు రోడ్డును బీటీకి రూ.83 లక్షలతో ఏర్పాటు చేయనున్న నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వెల్నెస్ కేంద్రంలో పోలీసుశాఖ ఏర్పాటు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోలీసుశాఖకు ఆడిటోరియం ఏర్పాటు త్వరలో జరుగుతుందని, ఇందుకోసం నిధులు మంజూరుకు కృషి చేస్తున్నామని మంత్రి భరోసా ఇచ్చారు.
బాధితులను కుటుంబ సభ్యుల్లా చూడాలి..
ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారిలో అధికులు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన పేద వారు వైద్య సేవలకు వచ్చే వారిని ప్రేమతో పలకరిస్తూ కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలని హెడ్ నర్సులకు మంత్రి సూచించారు. ముఖ్యంగా ప్రసూతి కేంద్రాల్లో కొందరు నర్సులు గర్భిణులపై అమర్యాదగా మాట్లాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి పరిస్థితి జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, చెత్తచెదారం లేకుండా శుభ్రం చేయాలని కోరారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, డీఎంహెచ్వో గాయత్రీదేవి, కళాశాల ప్రిన్సిపల్ వాణి, సూపరింటెండెంట్ అనిల్, పబ్లిక్ అండ్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు, ఆర్అండ్బీ అధికారులు, దవాఖాన వైద్య బృందం, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.