గుమ్మడిదల,డిసెంబర్ 5: వినియోగదారుడికి అండగా జిల్లా వినియోగదారుల ఫోరం నిలిచింది. వినియోగదారుడిని మానసిక ఒత్తిడి, వేదనకు గురి చేసిన ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.25 వేలు జరిమానా, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.5 వేలు అధనంగా చెల్లించాలని తీర్పు వెల్లడించింది. బ్యాంకు ఖాతాదారుడు(వినియోగదారుడు) సూరారం మహేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సూరారం మహేశ్కు ఐసీఐసీఐ బ్యాంక్ మేడ్చల్ శాఖలో సేవింగ్ ఖాతను కలిగి ఉన్నాడు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం తన ఖాతాను నిర్వహిస్తున్నాడు. కానీ బ్యాంకు వారు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఖాతాను నిర్వహించగడానికి ముందస్తు నోటీసు లేకుండానే అతడి వ్యక్తిగత ఖాతాను తొలిగించారు. అలాగే ఖాతాలో ఉన్న రూ.84.389 వేలను బ్యాంకు వారు డీడీ రూపంలో ఇంటికి పంపించారు.
ఖాతాదారు వివిధ వ్యక్తులకు ఐసీఐసీఐ బ్యాంకు చెక్కులను ఇవ్వడం వల్ల అనేకరకమైన ఇబ్బందులకు, మానసిక వేదనకు గురైనాడు. ఖాతాదారుడు ఈవిషయాన్ని బ్యాంకు మేనేజరును వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, దురుసుగా సమాధానం చెప్పడంతో మహేశ్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కోర్టు వారు వాదప్రతివాదనలు విని మహేశ్కు మానసిక వేదనకు గురి చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంకు వారికి రూ.25 వేలు జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు(మొత్తం రూ. 30వేలు) విధించింది. ఆ జరిమానాను 40 రోజుల్లో చెల్లించని ఎడల రూ.9 వడ్డీతో చెల్లించ వలసి వస్తుందని కోర్టు వారు ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే ఖాతాను పునరుద్ధ్దరించాలని కోర్టు తీర్పు వెల్లడించిందని ఖాతాదారుడు మహేశ్ తెలిపారు. వినియోగదారుల ఫోరం ద్వారా ఓ సామాన్యుడికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.