వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నది. సాగునీటి లభ్యత పెంచి చివరి ఎకరాకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వాగులు, వంకల్లో వృథాగా పోతున్న నీటిని నిల్వచేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా పెద్దఎత్తున చెక్డ్యామ్లు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రూ.45.55 కోట్లతో కొత్తగా 11 చెక్డ్యామ్లు నిర్మిస్తున్నది. వీటిల్లో మూడు పూర్తవగా, ఎనిమిది చోట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో 15 చెక్డ్యామ్ల నిర్మాణానికి సర్కారు రూ.119.11 కోట్లు మంజూరు చేయగా, 11 పూర్తయ్యాయి. మరో 4 ప్రాంతాల్లో పనులు చివరి దశలో ఉన్నాయి. అన్ని చెక్డ్యామ్లు అందుబాటులోకి వస్తే నీరు పుష్కలంగా లభించడంతో వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని, రెండు పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి/మెదక్, (నమస్తే తెలంగాణ), ఫిబ్రవరి 7
పెరుగుతున్న భూగర్భ జలాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని జలవనరులు ఇప్పుడు కొత్త నడక నేర్చుకున్నాయి. వాగులు, వంకల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి, నీటి నిల్వను పెంచేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందుకోసం పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ల నిర్మాణాలను చేపట్టి జల సంరక్షణ చేస్తున్నది. మెదక్ జిల్లాలో 15 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.119.11 కోట్లు మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలో రూ.45.55 కోట్లతో నూతనంగా 11 చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. దీంతో ఆయా చెక్డ్యామ్ల్లో జలాలు మత్తళ్లు దుంకుతూ పరవళ్లు తొక్కుతున్నాయి.
మెదక్లో 15 చెక్ డ్యామ్ల నిర్మాణం
చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.119.11 కోట్లు మంజూరు చేయగా, మంజీరా నదిపై 9 చెక్డ్యామ్లు, హల్దీవాగుపై 6 చెక్డ్యామ్లు నిర్మించారు. మంజీరా నదిపై నిర్మిస్తున్న అజ్జమర్రి, చిట్కుట్, ఎనగండ్ల, కుచన్పల్లి, సర్ధన, పైతరలో చెక్డ్యామ్లు పూర్తయ్యాయి. ఫైజాబాద్, చండూర్, కోనాపూర్లో చెక్డ్యామ్లు చివరి దశలో ఉన్నాయి. హల్దీవాగుపై నిర్మిస్తున్న 6 చెక్డ్యామ్లలో 5 పూర్తి కాగా, మరో చెక్డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి.
చెక్డ్యామ్లలో పుష్కలంగా నీరు..
జిల్లాలోని చెక్డ్యామ్లలో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వర్షాలు కురిస్తేనే పంటలు పండేవి. లేకపోతే రైతులు పంటలు పండించుకోలేక చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెట్టారు. చివరి గుంట వరకూ నీరందించేలా చెక్డ్యామ్లను నిర్మించారు. మెదక్ జిల్లాలో 15 చెక్డ్యామ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.119.11 కోట్లు మంజూరు చేసింది.
మెదక్ మండలం ర్యాలమడుగు చెక్డ్యామ్కు రూ.20 కోట్లు కేటాయించగా, జిల్లాలోని మిగతా చెక్డ్యామ్లకు నిధులు మంజూ రు చేయడంతో పనులు వేగవంతంగా కొనసాగా యి. మంజీరాపై 9 చెక్డ్యామ్లు నిర్మించగా, ఇప్పటి వరకు ఆరు పూర్తయ్యాయి. మరో మూడు చెక్డ్యామ్లు చివరి దశలో ఉన్నాయి. హల్దీవాగుపై 6 చెక్డ్యామ్లు నిర్మించగా, ఐదు పూర్తికాగా, మరో చెక్డ్యామ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చెక్డ్యామ్లు పూర్తయితే 27,698 ఎకరాలకు సాగునీరు అందనున్నది. జిల్లాలోని చెక్డ్యామ్ల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలు పండే విధంగా చెక్డ్యామ్లు జలకళను సంతరించుకుంటున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 11 చెక్డ్యామ్ల నిర్మాణం
సంగారెడ్డి జిల్లాలో రూ.45.55 కోట్లతో 11 చెక్డ్యామ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు చెక్డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా, ఎనిమిది చెక్డ్యామ్ల నిర్మాణ పనులు ఆయా దశల్లో ఉన్నాయి. చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తయితే జిల్లాలో 5వేల ఎకరాలకు సాగునీరందనున్నది. జిల్లాలో ఇప్పటికే 3140 చెరువులు, కుంటల ద్వారా 1,41,354 ఎకరాలకు సాగునీరందుతున్నది. ప్రభుత్వం మంజీరానదితో పాటు పలుచోట్ల చెక్డ్యామ్లు నిర్మించి ఆయకట్టుకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు రూ.45.55 కోట్లు మంజూరు చేసి 11 చెక్డ్యామ్ల నిర్మాణాలు చేపడుతున్నది. వీటితో 11,258 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. హత్నూర మండలంలో మంజీరానదిపై రెండు చెక్డ్యామ్లు నిర్మిస్తున్నారు. రూ.6.17 కోట్లతో రెడ్డిఖానాపూర్లో చెక్డ్యామ్ నిర్మిస్తున్నారు. లింగాపూర్లో రూ.6.37 కోట్లతో చెక్డ్యామ్ నిర్మిస్తున్నారు. మునిపల్లి మండలంలోని డబ్బవాగుపై రెండు చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తయ్యింది.
మునిపల్లి మండలం తాటిపల్లిలో డబ్బవాగుపైర రూ.1.95 కోట్లతో చెక్డ్యామ్ నిర్మించారు. బోడపల్లిలో రూ.1.95 కోట్లతో చెక్డ్యామ్ నిర్మాణం పూర్తి చేశారు. కల్హేర్ మండంలోని నల్లవాగుపై కొత్తగా రెండు చెక్డ్యామ్లు నిర్మిస్తున్నారు. కల్హేర్లో రూ.1.65 కోట్లతో చెక్డ్యామ్ నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయి. బీబీపేటలో రూ.1.56 కోట్లతో నల్లవాగుపై చెక్డ్యామ్ నిర్మిస్తున్నారు. సిర్గాపూర్ మండలం పోచారంలో రూ.2.07 కోట్లతో చెక్డ్యామ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వం రూ.23.86 కోట్లతో మంజీరానదిపై సంగారెడ్డి మండలం ఫసల్వాది, చౌటకూరు మండలం వెండికోల్, హత్నూర మండలం పన్యాల, నవాబ్పేట గ్రామాల్లో కొత్తగా నాలుగు చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది. ఇందులో ఫసల్వాదిలో చెక్డ్యామ్ నిర్మాణం పూర్తవగా, మిగితా మూడు చెక్డ్యామ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందజేస్తున్నది. నల్లవాగు ప్రాజెక్టు ద్వారా 6030 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 8 చెరువుల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని చెరువులకు పూర్వవైభవం తీసుకురావటంతోపాటు అవసరమైన చోట కొత్త చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో రూ.56.48 కోట్లతో కొత్తగా ఎనిమిది చెరువులు నిర్మాణం చేపడుతున్నది. ఇందుకు సంబంధించి టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తవగా, నీటిపారుదలశాఖ పర్యవేక్షణలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1810 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం కొత్తగా ఎనిమిది చెరువులు నిర్మిస్తున్నది. నాగల్గిద్ద మండలంలోని ఎస్గి రూ.41.9 కోట్లతో 100 ఎకరాలకు సాగునీరు అందేలా కొత్త చెరువు నిర్మిస్తున్నారు. నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథపూర్ రూ.2.14 కోట్లు (60 ఎకరాల ఆయకట్టు), కంగ్టి మండలం సుక్కలతీర్థ్లో రూ.14.47 కోట్లు (300 ఎకరాల ఆయకట్టు)తో చెరువులు నిర్మిస్తున్నారు. మనూరు, నాగల్గిద్ద మండలాల్లోని ఊట్లలో రూ.6.49 కోట్లు (260 ఎకరాల ఆయకట్టు), కేస్వార్లో రూ.6.27 కోట్లు (240 ఎకరాల ఆయకట్టు), మోర్గిలో రూ.6.17 కోట్లు (400 ఎకరాల ఆయకట్టు), ఇర్కపల్లి ఈస్ట్లో రూ.9.90 కోట్లు (250 ఎకరాల ఆయకట్టు), ఇర్కపల్లిలో రూ.6.74 కోట్లతో (200 ఎకరాల ఆయకట్టు) కొత్త చెరువులు నిర్మిస్తున్నారు.
జలకళ సంతరించుకుంటున్న చెక్డ్యాంలు..
మెదక్ జిల్లాలోని హల్ధీవాగు, మంజీరానదిపై నిర్మించిన చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. పొలాలకు నీరు చేరి పంటలు బాగా పండుతున్నాయి. గతంలో వర్షం నీరు వాగులు, కాలువల ద్వారా చెరువుల్లోకి వెళ్లి వృథాగా పోయేవి. చెక్డ్యాంల నిర్మాణంతో నీటి నిల్వలతో పాటు సమీప ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందనున్నది.
రెండు పంటలకూ పుష్కలంగా నీరు..
మెదక్ జిల్లాలో 15 చెక్డ్యామ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.119.11 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే చెక్డ్యామ్లో నీరు పుష్కలంగా ఉంది. రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశమున్నది. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చెక్డ్యాంల కింద ఉన్న భూములు రెండు పంటలూ పండుతున్నాయి. రైతులు సంతోషంగా ఉంటున్నారు.
– ఏసయ్య, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ మెదక్