కోహీర్, నవంబర్24: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నది. వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. కోహీర్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామానికి సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడేవారు. రెండు గ్రామాల మధ్యలో నారింజ వాగు ఉండడంతో రోడ్డు కూడా పూర్తిగా ధ్వసమైంది. దీంతో పోతిరెడ్డిపల్లి నుంచి కోహీర్కు రావాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోతిరెడ్డిపల్లి నుంచి కోహీర్కు నేరుగా ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కానీ రోడ్డు పనికి రాకుండా పోవడంతో ఆర్టీసీ బస్సులు నిలిపేశారు. దీంతో వాహనదారులు కోహీర్కు వెళ్లాలంటే వెంకటాపూర్, కవేలి జాతీయ రహదారి గుండా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. తహసీల్, ఎంపీపీ కార్యాలయాలు, పోలీస్స్టేషన్, విద్యాసంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబబ్బందులు పడేవారు.
తెలంగాణ ఏర్పాటుతో పరిష్కారం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో పోతిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరిపోయాయి. అంతకుముందు పదేండ్ల పాటు ఇబ్బందులు పడిన వాహనదారుల కష్టాలు తొలగిపోయాయి. ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో కోహీర్-పోతిరెడ్డి గ్రామాల మధ్యనున్న నారింజ వాగుపై వంతెన నిర్మించింది. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆరు సంవత్సరాల నుంచి వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ప్రభుత్వం చేపట్టిన పనులతో వాహనదారులు, ప్రయాణికుల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంచి పని చేశారు
పోతిరెడ్డిపల్లి నుంచి కోహీర్ వెళ్లాలం టే ఇబ్బందులు పడినం. రెండు గ్రామాల మధ్యలో నారింజ వాగు ఉండడంతో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వంతెనను నిర్మించి మంచి పని చేశారు. వంతెన నిర్మించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– గొల్ల రమేశ్, పోతిరెడ్డిపల్లి సర్పంచ్
ఇబ్బందులు పడ్డరు..
పోతిరెడ్డిపల్లి, కోహీర్ మధ్యన ఉన్న నారింజ వాగు వద్ద రోడ్డు సరిగా లేకపోవడంతో పదేండ్లు రాకపోక లు నిలిచిపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వంతెన కట్టారు. సమస్య తీర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– స్రవంతీరెడ్డి, పీఏసీఎస్ చైర్పర్సన్