చేర్యాల, జనవరి 8: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నివర్గాలు సుఖసంతోషాలతో జీవనం సాగించేందుకు స్వామివారు అనుగ్రహించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన పూజలను మల్లన్న ఆలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనువంశిక వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి ఆలయంలో స్వస్తిక్ పుణ్యాహవచనం, గణపతి పూజ, పంచచార్య పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహానైవేద్యం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అంతేకాకుండా లక్ష బిల్వాలను (మారేడు) స్వామి మూలవిరాట్ వద్ద సమర్పిస్తూ 1008 మల్లన్న నామస్మరణలను పఠిస్తూ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో బిల్వార్చన పూజలు కొనసాగించారు. పూజల్లో ఆలయ అర్చకుడు మహాదేవుని శ్రీనివాస్, మనోహర్ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ కమిటీ సభ్యుడు చిరమల్ల నర్సింహులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ఆలయ అర్చకులు, లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక పూజలతో కల్యాణ వేడుకలు ముగిసినట్లు ప్రకటించారు. రానున్న సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజు పట్నం వారంతో తిరిగి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ భక్తులు పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలను నిర్వహించుకుంటారని, మొదటి వారానికి సుమారు లక్ష మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తారని వారు వెల్లడించారు. స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు విజయవంతంగా ముగియడంతో ఆలయవర్గాలు సంప్రదాయం మేరకు ఆలయ సిబ్బందిని ఈవో ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా సన్మానించారు.