కంది, డిసెంబర్ 17: జిల్లాకేంద్రమైన సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎస్, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిసినట్లు ఎస్పీ రమణకుమార్ పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా ప్రత్యేక నిఘా నీడలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశామన్నారు. మొత్తం 8264మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 7264 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో 2989 మంది ఫైనల్ రాత పరీక్షకు అర్హత సాధించారని పేర్కొన్నారు.
శనివారం నిర్వహించిన పరీక్షల్లో 719 మంది పురుష అభ్యర్థులు, 627 మంది మహిళా అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కాగా, 237మంది ఫైనల్ రాత పరీక్షలకు అర్హత సాధించారని తెలిపారు. ఈనెల 8న ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించామన్నారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఫైనల్ రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉషా విశ్వనాథ్, డీఎస్పీలు రవీందర్, బాలాజీ, రఘు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.