అందోల్, నవంబర్ 30: వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొందరు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, హాజరు పట్టిక నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 19 మంది సిబ్బంది (వైద్యులు, వైద్యసిబ్బంది)కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే సిబ్బంది రోగులపై ప్రేమభావం కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, రికార్డులను సరిగా మెయింటనెన్స్ చేయాలని సూచించారు. జోగిపేట దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానకు వస్తారని, వారు మళ్లీ సంతోషంగా ఇల్లు చేరేలా చూసే బాధ్యత మనపై ఉంటుందన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ రమేశ్ తదితరులున్నారు.