సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 28: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ చెన్నూరి రూపేశ్తో కలిసి ఎన్నికల వ్యయ నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ కమిటీ, గ్రీవెన్స్ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలను నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీల్లో పట్టుబడిన నగదుకు రసీదు అందించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందజేయాలన్నారు. బార్డర్ చెక్పోస్ట్ల్లో తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ 24 గంటలు ఉండాలన్నారు. అభ్యర్థులు సువిధ యాప్లో అన్ని అనుమతులు పొందవచ్చన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల ఖర్చు రూ.90 లక్షలకు మించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్వహించే రోడ్ షోలో భోజనాల ఖర్చులను ఎఫ్ఎస్టీ బృందంలో రికార్డు చేయాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ ప్రచారాలు నిలిపివేయాలని ఆదేశించారు.
రిటర్నింగ్ అధికారి అనుమతితో అభ్యర్థులు ఖర్చుల వివరాలు అకౌంటింగ్ బృందం అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలన్నారు. నేషనల్ హైవే 65పై తనిఖీ కేంద్రాల వద్ద విధిగా అన్ని వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సీ విజిల్ యాప్ 1950 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, యాప్లో వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ మాట్లాడుతూ తనిఖీల సమయంలో చెక్పోస్ట్ల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుండా సూచనలు చేయాలని, పట్టుబడ్డ నగదుకు రసీదు అందించాలని వివరించారు.
ఎన్నికల ఖర్చులకు సంబంధించి నగదు పట్టుబడితే ఎఫ్ఐఆర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రచార వాహనాల నెంబర్లు పరిశీలించాలని, ప్రచారాల్లో డీజేలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం తీసుకొని వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నారు. మనరాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వాహనాలకు అనుమతులు ఉన్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, జడ్పీసీఈవో జానకీరెడ్డి, డీఎఫ్వో శ్రీధర్, ఎల్డీఏం గోపాల్, ఏఆర్వోలు, ఆర్టీవోలు, ఎక్సైజ్ అధికారులు, నోడల్, పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.