జిన్నారం, ఫిబ్రవరి 29 : దొంగ సరానికుంటను ధ్వంసం చేసి ఆరేండ్లవుతున్నా కారకులపై చర్యలు తీసుకోకపోవడంపై ఈనెల 27న ‘కబ్జాలో దొంగ సరానికుంట’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ వల్లూరు క్రాంతి సీరియస్ అయిన విషయం విదితమే. కుంటను పూడ్చి, కట్టను పూర్తిగా తొలిగించి చదును చేసిన తీరుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈఈ దిలీప్, వర్క్ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి గురువారం కుంటను పరిశీలించారు.
ఇరిగేషన్ రికార్డుల ప్రకారం కట్ట ఉన్న స్థలాన్ని, నీటి నిలువ ఎక్కడి వరకు ఉందో తిరిగి పరిశీలించారు. కుంటను పూడ్చి, కట్టను ధ్వంసం చేసిన వారిపై జిన్నారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఆక్రమించిన వారు కుంట, కట్టను పునర్నిర్మానం చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ భిక్షపతి అన్నారు.