అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలవనరుల్లో నీరు చేరగా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు చెరువులు, చెక్ డ్యామ్లు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల వరద ఉధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా మెదక్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రోజంతా వర్షం కురుస్తుండడంతో జనసంచారం స్థంభించింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 32.8 మి.మీ వర్షపాతం..
గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8గంటల నుంచి మంగళవారం వరకు) జిల్లాలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 49.2 మి.మీ. వర్షం కురిసింది. మనోహరాబాద్లో 47.2 మి.మీ, మెదక్లో 41.1 మి.మీ, శివ్వంపేటలో 40.6 మి.మీ, వెల్దుర్తిలో 40.5 మి.మీ వర్షం కురిసింది. తూప్రాన్లో 38.9 మి.మీ, మాసాయిపేటలో 36.3 మి.మీ, కొల్చారంలో 38.8 మి.మీ, చిన్నశంకరంపేటలో 36.5 మి.మీ, నిజాంపేట్లో 34.6 మి,మీ, రామాయంపేటలో 33.6 మి.మీ, హవేళీఘనపూర్లో 31.9 మి.మీ, చేగుంటలో 30.0 మి.మీ, పెద్దశంకరంపేటలో 30.2 మి.మీ, అల్లాదుర్గం 23.4 మి.మీ, నార్సింగిలో 26.0 మి.మీ, కౌడిపల్లిలో 24.3 మి.మీ, చిలిపిచెడ్లో 21.4 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు..
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని ప్రజలంతా ప్రమాద హెచ్చరికలు పాటించాలని సూచించారు. ఈ దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండవద్దని, తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 24 గంటలు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూం నంబర్: 7901677782కు ఫోన్ చేయాలని ట్రాన్స్కో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అలుగెల్లిన నల్లవాగు
సిర్గాపూర్, జూలై 25: సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులో ఒకటైన నల్లవాగు జలాశయం మంగళవారం సాయంత్రం అలుగు పారిందని డీఈఈ పవన్ తెలిపారు. వారం రోజులుగా ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షానికి నల్లవాగు ప్రాజెక్టులోకి ఉధృతంగా వరద చేరుకున్నది. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులు నిండిపోవడంతో అలుగుపారుతుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 213 వరద నీరు చేరుకోగా, అలుగుపై నుంచి 36 క్యూసెక్కులు నీరు దిగువ భాగానికి వెళ్తున్నాయి. ప్రాజెక్టు అలుగు పడడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.