మెదక్ మున్సిపాలిటీ, మార్చి 15 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల కమిటీ ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వహణ, ‘మనఊరు-మనబడి’ పనుల పూర్తిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ దగ్గర పడుతున్న తరుణంలో పాఠశాలల్లో మౌలిక, కనీస వసతుల కల్పన పనులను ప్రారంభించాలన్నారు.
ఇప్పటి నుంచి పనులను ప్రారంభించి, పాఠశాలలు తెరిచే జూన్ 12వ తేదీలోగా పూర్తి చేయించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదోడ్ల మరమ్మతులు, బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి పథకంలో కిచెన్ షెడ్స్, టాయిలెట్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా సమైక్య భవన నిర్మాణంపై టెక్నికల్ సిబ్బందితోపాటు మహిళా సమైక్య సభ్యులకు గైడ్లైన్స్ ఇస్తామన్నారు. చేపట్టిన పనులను జూన్లోగా పూర్తి చేయాలన్నారు. పనులు ప్రారంభించిప్పడు, ముగిసిన తరువాత ఫొటోలు తీసుకుని ఎంబీ రికార్డు చేసి ఏఈ , డీఈ, ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీ అత్యవసర పనులకు సుమారు రూ.25వేలు వినియోగించుకోవచ్చని తెలిపారు.అమ్మ పాఠశాల నిర్వహణ కమిటికీ ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనులకు రూ.లక్ష వరకు ఎంపీడీవో పరిశీలించి బిల్లులు చెల్లిస్తారని, రూ. లక్షకు పైగా పనులకు ఎంబీ బుక్లను పరిశీలించి కలెక్టర్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. సమీక్షలో స్థానిక సం స్థల కలెక్టర్ రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈవో ఏల్లయ్య, మెప్మా పీడీ ఇందిర, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నర్సాపూర్, మార్చి 15 : కౌంటింగ్ కేంద్రాలతోపాటు, స్ట్రాంగ్ రూమ్ల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని చూడాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలు సమిపిస్తున్న నేపధ్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లను శుక్రవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనలతో బీవీఆర్ఐటీ కళాశాలను సందర్శించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం నర్సాపూర్ నిమోజకవర్గంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో 5 సెగ్మెంట్లకు కౌంటింగ్ సెంటర్, ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో 2 సెగ్మెంట్లకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంట ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, బీవీఆర్ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ దూబే, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షమయ్య ఉన్నారు.