వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 8: మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. గురువారం సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా దేశ వ్యాప్తంగా 41 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎఫ్ (అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ) సెంటర్లను సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్పై ప్రదర్శించారు. అనంతరం ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ఏటీఎఫ్ సెంటర్ను సీపీ, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కారణాలతో మత్తుకు బానిసైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్న ఏటీఎఫ్ కేంద్రాన్ని వరంగల్లో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు.
ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఎయిమ్స్ వైద్యాధికారుల సూచనలు, సలహాలను పాటిస్తామన్నారు. మత్తు పదార్థ్ధాల బారిన పడిన వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏటీఎఫ్ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి సాధారణ స్థితికి తీసుకురావడానికి పోలీసులు గతంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. మత్తు బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుతో నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం ఆర్ఎంఓలు హరీశ్రాజ్, శ్రీనివాస్, ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, ఎంజీఎం ఉద్యోగులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.