సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13: అధికారులు ఈ నెల చివరి వరకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎం, మున్సిపల్, ప్రభుత్వ, ప్రైవేటు గ్రామీణ బ్యాంకు ల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్డీఏకు సంబంధించిన సెర్ప్ బ్యాంకు లింకేజీ కార్యక్రమంపై మండలాల వారీగా డీఆర్డీఓ, ఏపీఎం, ఎల్డీఎం, అన్ని బ్యాంకుల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్హెచ్జీ రుణాలు రూ.743.68 కోట్లకు రూ.599.57 కోట్ల రుణా లు మంజూరు చేసినట్లు తెలిపారు. మెప్మా ద్వారా రూ.49.65 కోట్లకు రూ.61.31 కోట్లు పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. వీధి వ్యాపారులకు సంబంధించి రెండు, మూడో లింకేజీ రుణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, ఘర్ఘర్ కిసాన్ క్రెడిట్ కార్డు అభియాన్ గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.
సురక్ష జీవన్ జ్యోతి బీమా, ఏపీవై పింఛన్ పథకాల గురించి వివరించాలన్నారు. హరితహారం కార్యక్రమానికి ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు. ఈజీఎస్లో కూలీల సేకరణ శాతం లో జిల్లా కింది వరుసలో ఉన్నదని అసహనం వ్యక్తం చేశారు. కూలీల సంఖ్య ను పెంచేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓలకు సూచించారు. జిల్లాలో కొత్తగా ఫాంపాండ్, ఫిష్పాండ్లను ఏర్పాటు చేసేందుకు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు. అమృ త్ సరోవర్ పథకంలో భాగంగా మండలానికి ఒక చెరువు నిర్మించాలన్నారు. తోటల పెంపకం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల తన దృష్టికి తీసుకురావాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, ఎల్డీఎం సత్యజిత్, జడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ దేవకీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.