సిద్దిపేట, సెప్టెంబర్ 15 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నేల చిత్తడిగా మారిందన్నారు. నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వ్యాపించే అవకాశం ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేలా మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సంక్షేమశాఖ, డీఆర్డీవో, విద్య తదితర శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహించి అన్ని వయస్సుల బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధన్రాజ్ను ఆదేశించారు.
స్వచ్ఛతాహీ సేవ 2025 ద్వారా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ప్రజల సహకారంతో శ్రమదానం, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాల తొలిగింపు, పర్యావరణహితమైన పండుగల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని డీఆర్డీవో జయదేవ్ ఆర్యను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వా ల్, అబ్దుల్హమీద్, డీఆర్డీవో జయదేవ్ ఆర్యతో కలిసి స్వచ్ఛతాహీ సేవ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.