సిద్దిపేట అర్బన్, నవంబర్ 28: అతనికి ఫుట్బాల్ అంటే ప్రాణం. తనకు ఆడే అవకాశం రాకపోయినా.. అవకాశం ఉన్నవారిని పైస్థాయి తీసుకుపోవాలన్నదే అతని ఆకాంక్ష. అతని కోరికకు తగ్గట్టే ఫుట్బాల్ శిక్షణను ఇస్తూ ఎంతో మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నాడు. స్వచ్ఛందంగా ఫుట్బాల్ శిక్షణ ఇస్తూ చాలా మంది క్రీడాకారులను తయారు చేస్తున్నారు సిద్దిపేటకు చెందిన అజర్ షరీఫ్. కోచ్గా అనేక టోర్నీల్లో విజయం వైపు తన జట్టును తీసుకెళ్లాడు. ఒక శిక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ.. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రతిభా పాటవాలను వెలికితీస్తున్నాడు.
నిబద్ధత గల ఫుట్బాల్ శిక్షకుడిగా పేరు ఉన్న అజర్ షరీఫ్ను పలువురు ప్రముఖులు పలు సందర్భాల్లో సన్మానించారు. అతని శిక్షణలో రాష్ట్రస్థాయి జట్టుకు మిట్టపల్లి బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు ఎంపికవడమే కాకుండా ఆలిండియా ఫుడ్బాల్ ఫెడరేషన్ సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చినందుకు గానూ అజర్ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సన్మానించారు. అదే విధంగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు విజేతగా నిలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కోచ్ అజర్ను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఇతర ప్రముఖులు సన్మానించారు.
పదేండ్లుగా అజర్ షరీఫ్ కోచ్గా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో అనేక టోర్నీల్లో జట్టు విజయం సాధించింది. ఫుట్బాల్ క్రీడ అంటే తెలియని గురుకుల బాలికల పాఠశాలకు 2014లో ఆ క్రీడను పరిచయం చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చి, విద్యార్థినులను ప్రోత్సహించాడు. అతని శిక్షణలో 53మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, 24 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నారు. 2019-20లో మిట్టపల్లి గురుకుల పాఠశాలకు చెందిన తలారి నగ్మ అనే క్రీడాకారిణి అజర్ షరీఫ్ వద్ద శిక్షణ పొంది, అతి చిన్న వయసులోనే సీనియర్ నేషన్ ఉమెన్స్ చాంపియన్ షిప్నకు ఎంపికైంది.
2019లో మంచిర్యాల జిల్లాలో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి మహిళల పోటీల్లో అజర్ షరీఫ్ కోచ్గా వ్యవహరించిన నాటి ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆ టీమ్లో కేవలం మిట్టపల్లి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నుంచే ఆరుగురు బాలికలు ప్రాతినిధ్యం వహించారు. అంతే కాకుండా 2019-20లో వనపర్తి జిల్లాలో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి మెదక్ జిల్లా నాల్గో స్థానం, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అండర్-14 బాలికల రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలవడం గొప్ప విషయం. అంతే కాకుండా సిద్దిపేట గురుకుల పాఠశాలలకు చెందిన ఐదుగురు అమ్మాయిలను సీనియర్ నేషనల్లో ఆడటంతో పాటు అండర్-17 విభాగంలో అంజలి అనే క్రీడాకారిణి 9 జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నది.
చాలా ఏండ్లుగా గురుకుల పాఠశాలలో ఫుట్బాల్ కోచ్గా పని చేశా. ఫుట్బాల్ శిక్షణ ఇవ్వడమంటే నాకు ప్రాణం. అంతర్జాతీయంగా ఫుట్బాల్ క్రీడకు మంచి క్రేజ్ ఉంది. గురుకుల పాఠశాల విద్యార్థినిలు నేషనల్ స్థాయిలో ఆడేలా వారిని ప్రోత్సహించి, శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్న. మంత్రి హరీశ్రావు సార్.. నాకు ఏదైనా గురుకుల పాఠశాలలో అవకాశమిస్తే చాలా మంది పేద విద్యార్థినులను ఫుట్బాల్ క్రీడాకారులుగా తయారు చేస్తా.
– అజర్ షరీఫ్,ఫుట్బాల్ కోచ్, సిద్దిపేట