Konaipally | సిద్దిపేట, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దశాబ్దాలుగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం. ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన అనంతరమే పనులను ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్ పత్రాలను వేంకటేశ్వరస్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం 1985వ సంవత్సరం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. 1989, 1994, 1999, 2001, 2004, 2009 ఎన్నికల నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేసి విజయం సాధించారు.
తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక లక్ష్యమని ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్ 27న రాజీనామా చేసి, అదేరోజు ఉదయం కోనాయిపల్లి వేంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీ జెండాతో పాటు, సాహిత్యం, పాటల క్యాసెట్లను దేవుడి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్లోని జలదృశ్యంలో పార్టీని ఏర్పాటు చేసి 14 ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్టాన్ని సాధించారు.
2004లో తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల బీ ఫారాలకు పూజలు చేయించి వారికి అందజేశారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్కు, సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేసిన కేసీఆర్ రెండు చోట్ల ఘన విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్కు, హరీశ్రావు సిద్దిపేటకు, కేటీఆర్ సిరిసిల్లకు ముగ్గురి నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో సైతం ఇక్కడ కేసీఆర్ పూజలు చేసి గజ్వేల్, మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. 2018 సాధారణ ఎన్నికల్లో సైతం ఇక్కడ పూజలు చేసిన అనంతరం తన నామినేషన్ వేశారు. ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఇక్కడికి వచ్చి నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి అక్కడే సంతకాలు పెట్టి నామినేషన్ వేస్తారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీశ్రావుకు సైతం సెంటిమెంట్ దేవాలయమైంది. 2004 ఉప ఎన్నికల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న హరీశ్రావు తొలిసారిగా కోనాయిపల్లి ఆలయంలో తన నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ వేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి హరీశ్రావుకు సెంటిమెంట్ గుడిగా మారింది. మంత్రి హరీశ్ 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను సైతం ఇక్కడ పూజలు చేయించి ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తారు.
నంగునూరు మండల కోనాయిపల్లి వేంకటేశ్వరాలయం బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీకి సెంటిమెంట్ గుడిగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ దేవాలయ ముఖద్వారం దక్షణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రి హరీశ్రావు దేవాలయాన్ని రూ. 3 కోట్ల పైగా నిధులు ఖర్చుచేసి గుడిని పునర్నిర్మించారు. పునర్నిర్మాణంలో భాగంగా గుడి నిర్మాణం, ధ్వజస్తంభం, మూలవిరాట్ పాటు ప్రహరీ నిర్మించారు. 2022 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించారు. మరో రూ.50 లక్షలతో గ్రామంలో కల్యాణ మండపాన్ని సైతం నిర్మించారు.