జన్ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి?
రెండు వారాల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన..!
ఊహించని విధంగా జిల్లాకు గోదావరి జలాలు
రూ.4.400 కోట్లతో రెండు ప్రాజెక్టులు
4.50 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీళ్లు
కేంద్రంపై నిప్పులు చెరిగిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి 12 : సీఎం కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని, ఇది బీజేపీ నాయకులు గుర్తించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చురకలంటించారు. శనివారం సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమంలో ముందుండి, తెలంగాణ సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని బీజేపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో బండి సంజయ్, అరవింద్ ఎక్కడ ఉన్నా రో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో గుజరాత్ను మరిపించిందన్న అక్కసుతోనే ప్రధాని, పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడడం మంచిదికాదన్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల విభజన చేయడం తప్పని, విభజన చేసిన తర్వాత భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాలను ఆం ధ్రాలో కలిపిన తప్పిదం ప్రధానిది కాదా? అని ప్రశ్నించారు. ఏడేండ్ల హయాంలో ఏ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. నీరవ్మోదీ, విజయ్మాల్యాకు కొమ్ముకాసి విదేశాలకు పంపించింది ఎవరని నిలదీశారు. విదేశాల అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. అభివృద్ధిలో దేశాన్ని ముందుకు తీసుకపోవడం ఇష్టం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. విదేశాల్లో ములుగుతున్న నల్ల ధనాన్ని తెప్పించి, పేదల జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ ఎక్కడుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ముచ్చింతల్లో చినజీయర్స్వామి భక్తిశ్రద్ధలతో నాలుగేండ్లు కష్టపడి శ్రీరామానుజ భారీ విగ్రహం నిర్మిస్తే, ప్రధాని వచ్చి రాజకీయం చేయడం బీజేపీకే దక్కిందని ఎద్దేవాచేశారు. అంతటితో ఆగకుండా కేంద్ర మంత్రులు సందర్శించి, రాజకీయాలకు తెర లేపారని దుయ్యబట్టారు.
రెండు వారాల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన
రెండు వారాల్లో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఉంటుందని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. జిల్లాలో బపవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు. వచ్చే రెండు వారాల్లో జిల్లాకు వచ్చి, రైతులతో చర్చిస్తారని చెప్పారు. రెండు పంటలకు గోదావరి నీరందించేందుకు రూ.4400కోట్లతో రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో 4.50లక్షల ఎకరాలకు సాగు నీరందించే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టంచేశారు. ప్రపంచంలోని జాతీయ పార్టీల్లో అబద్ధాలు మాట్లాడేది ఒక బీజేపీయేనని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారని గుర్తించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతారని, అది సంగారెడ్డి నుంచే దేశా వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, బీజేపీని గద్దెదించే వరకు ఉద్యమం చేస్తారని, ప్రణాళికలు చేస్తున్నామని ఎంపీ ప్రకటించారు. అంతకుముందు టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చింతా ప్రభాకర్ను ఎంపీ సన్మానించి, స్వీటు తినిపించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు హకీమ్, మాజీ అధ్యక్షుడు చిల్వరి ప్రభాకర్, మోహన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చక్రపాణి, సర్పంచ్లు గోపాల్రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, కౌన్సిలర్ విష్ణవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ఆర్ఐ షకీల్, శ్రావణ్రెడ్డి, వాజిద్, అజీమ్, జలేందర్, రాజేందర్ నాయక్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే గ్రామ స్వరాజ్యం
సదాశివపేట రూరల్, ఫిబ్రవరి 12 : సీఎం కేసీఆర్తోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం కోనాపూర్, తంగెడపల్లి, సూరారం, మద్దికుంట, నందికంది, నాగ్సాన్పల్లి, పెద్దాపూర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్తో కలిసి ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. గాంధీజీ కలలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. సీఎం సమక్షంలో ఏడేండ్లలో గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు అందంగా తయారయ్యాయని చెప్పారు. తెలంగాణ ఇచ్చిందే బీజేపీ అని నాయకులు మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గానికి రూ.7కోట్ల 30లక్షల 4వేలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను మంత్రి హరీశ్రావు మంజూరు చేశారని తెలిపారు. కోనాపూర్లో రూ.80.45లక్షలు, సూరారం రూ.10లక్షలు, తంగెడపల్లి రూ.5లక్షలు, నందికంది రూ.15 లక్షలు, మద్దికుంట రూ.15లక్షలు, నాగ్సాన్పల్లి రూ.15 లక్షలు, పెద్దాపూర్ రూ.10 లక్షలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.