శివ్వంపేట మండలంలోని ఏదుల్లాపూర్లో సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు, ఎంపీపీ కల్లూరి హరికృష్ణల ఆధ్వర్యంలో కేక్ కట్చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, నేతలు
పోరాటాల పురిటిగడ్డపై పురుడు పోసుకున్న ఆయన పోరాట పటిమతో పంతం నెగ్గారు. పరాయి పాలకుల చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిపించి ఇక్కడి ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చారు. స్వరాష్ట్రంలో తనదైన సుపరిపాలనతో పాలనాదక్షతను చాటుకున్నారు. ప్రపంచం చూపును తెలంగాణ వైపు మరల్చి దార్శనికుడిగా కీర్తి పొందారు. సబ్బండ వర్ణాలు సంబురపడే పథకాలను అమలు చేయడం ద్వారా దేశ ప్రజల గుండెల్లో దేశ్ కీ నేతగా స్థానం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో పోరుజెండా పట్టి జయకేతనం ఎగురవేసిన మన రేడు ఇప్పుడు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ తన సేవలను దేశవ్యాప్తం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో పురుడుపోసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజును శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమాన లోకం సిద్ధమైంది.
సిద్దిపేట,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్/సంగారెడ్డి నెట్వర్క్ , ఫిబ్రవరి 16 : చిన్నతనం నుంచే గొప్ప మేధాశక్తి కేసీఆర్ సొంతం. తెలుగు వ్యాకరణం, భాషపై పట్టు సాధించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. రాజకీయ రంగప్రవేశం చేసి వివిధ పదవులను అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పోరుబిడ్డ కేసీఆర్కే ప్రజలు పాలనా పగ్గాలు అప్పగించారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని గడిచిన ఎనిమిదేండ్లుగా చేసి చూపించారు కేసీఆర్.
చరిత్రపుటల్లో చింతమడక..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడక. ఈ గ్రామంలో వ్యవసాయమే జీవనాధారంగా ప్రజలు జీవిస్తున్నారు. కేసీఆర్తో ఈ గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టడంతో కేసీఆర్ ఉన్నత స్థానానికి చేరారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా గ్రామంలోని ప్రతి వారితో ఆప్యాయంగా మెలుగుతారు. ఇప్పటికీ గ్రామంలో ఉన్న కేసీఆర్ స్నేహితులు, గ్రామ పెద్దలతో కలుపుగోలుగా ఉంటారు. గ్రామానికి వచ్చారంటే ప్రతి వారిని పేరు పెట్టి పిలుస్తుంటారు. సీఎం కేసీఆర్ స్వయంగా గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిచ్చి ఇస్తున్నారు. ఈ గ్రామానికి 556 ఇండ్లు మంజూరు కాగా, దాదాపు అన్ని ఇండ్లు పూర్తి కావొచ్చాయి. చక్కటి రహదారులు, సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వలు నిర్మించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలబెట్టుకునేలా ప్రతి కుటుంబానికి రూ.8 నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వీటితో ఆ కుటుంబాలు ఆటోరిక్షాలు, ట్రాలీలు, డీసీఎంలు, వరికోత మిషన్లను కొని ఇచ్చారు. మరికొందరికి డెయిరీ ఫాంలు పెట్టించారు. ఇవ్వాళ వారంతా వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలు..
కేసీఆర్ అనే వ్యక్తి ఒక మహాశక్తిగా మారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి. 70 వసంతాల కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తూ అన్నివర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నారు. సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ చేపట్టిన పలు పనులు నేడు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపునిచ్చాయి. ఈ పనుల స్ఫూర్తితోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సిద్దిపేట, రాష్ర్టానికే రోల్ మోడల్గా నిలిచింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటి గోస లేకుండా ఏ విధంగానైతే చేశారో.. అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పూర్వవైభవం తీసుకువచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు. సాగునీటి రంగానికి పెద్దపీట వేసి రికార్డు సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఇవ్వాళ మండుటెండల్లో చెరువులు నింపుతున్నారు. మూడు సంవత్సరాల నుంచి యాసంగి సాగుకు నీరు అందిస్తున్నారు. ఈ ప్రాంతానికి సాగునీళ్లు ఇచ్చి రైతుల బాధలను తీర్చారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించింది. రైతుల రుణాల్లో రూ. 96 వేల వరకు పూర్తిగా మాఫీ చేయనున్నారు.
మెరుగైన వైద్యం…
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయిలో దవాఖానలను అభివృద్ధి చేసిందీ బీఆర్ఎస్ సర్కారు. కేసీఆర్ కిట్టు సూపర్ హిైట్టెంది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సొంతింటి జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనున్నది. ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను సైతం విడుదల చేసింది. ఎక్కడాలేనివిధంగా ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తుండడంపై ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సంక్షేమ రంగంలో ఆసరా తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
కులవృత్తులకు పూర్వవైభవం..
చేపపిల్లల పంపిణీతో మత్స్య కార్మికులకు ఉపాధి దొరికింది. గొర్రెలు పంపిణీ చేసి గొల్లకుర్మ యాదవులను ఆర్థికంగా బలోపేతం చేశారు. దళితబంధు పథకానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయింపులు చేశారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేసిందీ సర్కారు. దళితుల రక్షణ కోసం దళిత నిధి పథకాన్ని సైతం తీసుకువచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనతోపాటు గ్రామ పంచాయతీలు, మండలాలు, డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చక్కటి భవనాలు నిర్మించారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు పట్టణాలు అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్ను అందించారు. హరితహారంతో పల్లేపట్నాల్లో పచ్చదనం ఉట్టిపడుతున్నది. డంపింగ్ యార్డులు,
వైకుంఠ ధామాలు నిర్మించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు..
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడికక్కడ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం సాయంత్రం ప్రారంభించారు. సిద్దిపేటలో నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొననున్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, దవాఖానల్లో పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అవుటర్ రింగురోడ్డులో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు.
రావి ఆకుపై సీఎం కేసీఆర్ చిత్రం
నారాయణఖేడ్, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్పుట్టిన రోజు పురస్కరించుకొని నారాయణఖేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై వేసిన సీఎం కేసీఆర్ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర మ్యాప్ మధ్యలో సీఎం కేసీఆర్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ను ప్రజలు తెలంగాణతో విడదీసి చూడలేరనే భావనతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు శివకుమార్ తెలిపారు.
– చిత్రకారుడు శివ కుమార్
ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు..
మనఊరు-మనబడితో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. పిల్లలకు మెరుగైన విద్య అందుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చిన్నారుల భవిష్యత్తు బంగారమవుతున్నది. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేసిండు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. స్కూళ్లలో పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది. విద్య కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేయడం సంతోషకరం.
– ఎంఏ ఖాన్, ఎల్ఐజీ, ఆర్సీపురం
కల్యాణలక్ష్మితో తీరిన ఇబ్బందులు
కూతురు పెండ్లిని అప్పు చేసి చేశాం. తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాం. రెండు నెలల్లో రూ.లక్ష నూట పదహార్లు చెక్కు రూపంలో వచ్చాయి. చెక్కును మా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి కంగ్టిలో అందించారు. ఆ డబ్బులు తీసుకుని అప్పు తీర్చినం. ఆపదలో మమ్మల్ని సీఎం కేసీఆర్ సారు ఆదుకొని సహాయం చేశాడు. సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం. రైతుబంధు ద్వారా మా భూమికి పెట్టుబడి సాయం అందుతున్నది. దీంతో, వ్యవసాయం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాం.
– నీలమ్మ, చౌకన్పల్లి, కంగ్టి
సీఎం కేసీఆర్ కారణజన్ముడు.. తప్పకుండా ప్రధాని అవుతారు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..అన్నట్లుగా కేసీఆర్ అత్యున్నత పదవిలో సీఎంగా ఉంటూ విద్యనేర్పిన గురువులను గౌరవించటం చూస్తూంటే ఇప్పటీకి పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థిగానే నాకు కనిపిస్తుంటారు. పుట్టిన గ్రామం, చదువుకున్న బడి, విద్య నేర్పిన గురువులను సీఎం కేసీఆర్ మరిచిపోలేదు. పాఠశాలలో అందరితో కలివిడిగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత కనబరిచేవారు. రాజకీయ చతురత, ప్రజా సంక్షేమం, దేశ వనరులు, అభివృద్ధి తదితర వాటిపై పూర్తి పట్టున్న సీఎం కేసీఆర్కు దేశ రాజకీయలను శాసించ గల శక్తి ఉంది. ఆయన తప్పకుండా భారత ప్రధానిగా అవుతారు.
విద్యార్థి దశ నుంచి నేటి వరకు కేసీఆర్కు గురువులంటే అమితమైన భక్తి. సీఎం కేసీఆర్కు గురువునవడం అదృష్టంగా భావిస్తున్నాను. చరిత్రను చదవడమే కాకుండా ఒక చర్రితను సృష్టించిన దార్శనికుడు. ఓ రకంగా ఆయన కారణజన్ముడు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం ప్రపంచానికే ఆదర్శం. తెలంగాణ వస్తే ఏం వస్తుందని ఎద్దేవా చేసిన విమర్శకుల నోళ్లు మూయించిన అభివృద్ధి ప్రధాత కేసీఆర్. కేంద్రంలో బీజేపీ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నది. బీజేపీ ప్రభుత్వంలో పేద, సామాన్య ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అవలంభిస్తున్న విధానాలతో రైతులు, సామన్య, పేద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తున్నాను.
– గన్నె బాల్రెడ్డి, సీఎం కేసీఆర్ గురువు (విశ్రాంత ఉపాధ్యాయుడు), దుబ్బాక
తెలంగాణ రూపురేఖలు మారినయ్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్గా తీర్చిదిద్దారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. తెలంగాణకు ముందు, ఆ తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. సాగుకు ఇరవై నాలుగు గంటలు కరెంటు, ఇంటింటికీ తాగునీరు సీఎం కేసీఆర్ చలవే. అప్పటి ఇరుకు రోడ్లు నేడు డబుల్ రోడ్లుగా మారాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. భారతదేశ ప్రధాని కావాలి.
– నిఖిల్గౌడ్, యువకుడు, జిన్నారం.
పింఛన్తో భరోసా
57 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్ అందుతున్నది. దేశంలో ఇంత తక్కువ వయసు వారికి పింఛన్ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కానీ మంచి మనసున్న సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తున్నడు. ఈ వయస్సులో ఎవరిపైనా ఆధారపడకుండా మా ఖర్చులు మేం చూసుకుంటున్నం. ఇంతమంచి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా రాణించాలి.
– రాచూరి కనకరత్నం, కోహీర్ వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు