మెదక్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణం జనంతో హోరెత్తింది. పట్టణానికి వచ్చే రోడ్లన్నీ కికిరిసిపోయాయి. బుధవారం జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనం హాజరయ్యారు. సీఎం కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ సభలో యువకులు, మహిళలు నినదించారు. కేసీఆర్, హరీశ్రావు, పద్మాదేవేందర్రెడ్డి చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు పట్టుకుని మహిళలు, యువత నృత్యాలు చేశారు. సీఎం కేసీఆర్ మళ్లీ రావాలని, కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ప్రజలు నినాదాలు చేశారు.
మెదక్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించని రీతిలో తరలివచ్చిన జనంతో సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానం కిటకిటలాడింది. మధ్యా హ్నం 3గంటల వరకే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి కేసీఆర్ను కండ్లారా చూసేందుకు నిరీక్షించారు. 5 గంటలకు వేదికపైకి సీఎం రావడంతోనే ఈలలు, కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ అభివాదానికి కేరింతలతో ప్రతిస్పందించారు. గులాబీ దళపతి రాక నియోజకవర్గ ప్రజల్లో జోష్ను నింపింది. సభలో మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఏకే గంగాధర్రావు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.