నర్సాపూర్, జూలై 8: జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు, దేశంలో ఒకేఒక్క సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నర్సాపూర్, శివ్వంపేట మండలాల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు హాజరై ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి 49మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో కూడా జర్నలిస్టులను కడుపులో పెట్టుకొని వారికి ఆర్థిక సాయం చేసినట్లు గుర్తు చేశారు.
అక్రిడిటేషన్ కార్డులు దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో ఇచ్చామన్నారు. జర్నలిస్టులకు ఇప్పటికే ఉచితంగా బస్సుపాసులను అందజేసి వారిని గౌరవించుకుంటున్నామని, ఇండ్ల స్థలాల విషయంలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉందని గుర్తుచేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్బెడ్రూం ఇండ్లు అందించడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో ఇప్పటివరకు 80 నుంచి 90శాతం వరకు ఇండ్ల స్థలాల పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో జర్నలిస్టులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, బీఆర్ఎస్తో వారికి తగిన ప్రాధాన్యం కల్పించామన్నారు. జర్నలిస్టులు కూడా ప్రభుత్వ సేవలను గుర్తించాలని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు.
కొంతమంది జర్నలిస్టులు 90శాతం చేసిన అభివృద్ధిని పక్కన పెట్టి 10శాతం చేయని అభివృద్ధిని వేలెత్తి చూపిస్తున్నారని, అభివృద్ధిని సైతం ప్రజలకు వివరించాలన్నారు. మంచి పనిచేసే ప్రభుత్వాలను జర్నలిస్టులు గుర్తించాలన్నారు. తెలంగాణ వచ్చాక నర్సాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, బస్సుడిపో, అర్బన్పార్కు, తాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని, దీనిని ప్రజలకు వివరించే బాధ్యత జర్నలిస్టులపై ఉన్నదన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వ్యవసాయ కూలీలు తెలంగాణలో కూలీ పనులు చేస్తున్నారని ఇలాంటి వార్తలను ప్రచురించి తెలంగాణ అభివృద్ధిని దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. పరాయి రాష్ర్టాలకు, తెలంగాణ రాష్ర్టానికి అభివృద్ధి విషయంలో వ్యత్యాసాన్ని వివరిస్తూ కథనాలు రాయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజీరానదిపై చెక్డ్యాంలు కట్టలేమని గత పాలకులు చేతులెత్తేశారని, కానీ నేడు సీఎం కేసీఆర్ కృషితో మంజీరానదిపై పదుల సంఖ్యలో చెక్డ్యాంలు నిర్మించుకున్నామని గుర్తుచేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సీం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీశ్రావు చొరవతో ఉమ్మ డి జిల్లాలో జర్నలిస్టులకు డబుల్బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో డబుల్బెడ్రూంలు, కొల్చారం, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామన్నారు. మిగతా మండలాల్లో కూడా త్వరలోనే ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిలను జర్నలిస్టులు ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, జర్నలిస్టులు పాల్గొన్నారు.