నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు చేపట్టారు. నాలుగు వేల మీటర్ల సీసీ రోడ్లు, 2300 మీటర్ల అండర్ డ్రైనేజీ, 780 మీటర్ల ఓపెన్ డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
– నర్సాపూర్, సెప్టెంబర్ 22
నర్సాపూర్, సెప్టెంబర్ 3: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీల రూపురేఖలు మారుతున్నాయి. ప్రజలకు అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. నర్సాపూర్ బల్దియా కేంద్రం ముందువరుసలో ఉన్నదని చెప్పవచ్చు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయగా, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. నర్సాపూర్ పట్టణానికి నయా లుక్ రావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు..
హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ నర్సాపూర్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కుకు 2020 జూన్ 25న వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో ఆయా నిధులు త్వరగా రావడంతో రూ.10.75 కోట్లతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ నిర్మాణాలకు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 4 వేల మీటర్ల సీసీ రోడ్లు, 2300 మీటర్ల అండర్ డ్రైనేజీలు, 780 మీటర్ల ఓపెన్ డ్రైనేజీల నిర్మాణాలను పూర్తి చేశారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రయాణ ఇబ్బందులు తొలిగిపోయాయని స్థానికులు ఆనందంతో చెబుతున్నారు. గతంలో వర్షాకాలం వచ్చిందంటే నడవడానికి, వాహనాలపై ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉండేదని, ఇప్పడు ఆ బాధ తప్పిందని అంటున్నారు. డ్రైనేజీ నిర్మాణంతో ఈగల, దోమల బాధల నుంచి పట్టణ వాసులకు విముక్తి లభించింది. మున్సిపాలిటీలోని 3, 5, 7 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేయాల్సి ఉంది. మిగతా వార్డుల్లో పనులు పూర్తికావచ్చాయి.
మున్సిపాలిటీ రూపురేఖలు మారాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నర్సాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయాయి. నర్సాపూర్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.25 కోట్లతో ఎంతో అభివృద్ధి చేసుకోగలిగాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుని ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నాం. మున్ముందు నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకుపోతాం. ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ మెదక్ వచ్చిన సందర్భంగా మళ్లీ రూ.25 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది.
– చిలుముల మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే