సిర్గాపూర్, ఫిబ్రవరి 25: గ్రామాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తున్నది. తెలంగాణ ఏర్పడకముందు మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వానకాలంలో వాగులు, వంకలు పొంగి దారులు దిగ్బంధమై గంటల తరబడి రాకపోకలు స్తంభించేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత ఉప ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా మహారెడ్డి భూపాల్రెడ్డి గెలిచాక నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అందుకు నిదర్శనం సిర్గాపూర్ మండలంలోని కిషన్ నాయక్తండా నుంచి పొట్పల్లి వరకు కొత్తగా నిర్మిస్తున్న ఫార్మేషన్ రోడ్డు, బీటీ రోడ్డు. ఈ రోడ్డు పూర్తైతే 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పొట్పల్లి నుంచి కిషన్నాయక్ తండాకు వెళ్లాలంటే 7 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయితే, గతంలో ఈ గ్రామాలకు పానాది దారి సైతం లేని పరిస్థితులు. కేవలం రైతులు తమ పొలాలకు వెళ్లే దారులు మాత్రమే ఉండేవి. కాగా, పక్కా రోడ్డు నిర్మించాలని స్థానిక వైస్ ఎంపీపీ ప్రయాగ మాధవరావు, కిషన్ నాయక్తండా సర్పంచ్ జగ్గురాం, తదితర బీఆర్ఎస్ నాయకులు ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి రోడ్డు మంజూరు కోసం అధికారులతో సర్వే చేయించి, అంచనాలు సిద్ధం చేసి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు చొరవతో రోడ్డు నిర్మాణానికి రూ.4.37కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఆరునెలల క్రితం మంత్రి హరీశ్రావు రోడ్డు పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఫార్మేషన్ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ప్రస్తుతం శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. అయితే, మొత్తం పనులు పూర్తి కావడానికి మరో ఆరు నెలల వరకు సమయం పట్టొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, బీటీ వేయక ముందు, ఫార్మేషన్ రోడ్డుపై కొత్త సాంకేతిక విధానంతో టెర్రజెన్ కెమికల్, మెటల్ మిక్స్తో మూడు లేయర్లు చేపట్టి, దీనిపై బీటీ రోడ్డును వేస్తామని పంచాయతీ రాజ్ ఇంజినీర్ అధికారి మాధవనాయుడు తెలిపారు.
కిషన్నాయక్ తండా నుంచి పొట్పల్లి వెళ్లే వరకు ఎన్నో వాగులు, పిల్లవాగులు ఉన్నాయి. వాటిపై మొత్తం 24 కల్వర్టులను నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం, ఫార్మేషన్ రోడ్డు పూర్తవడంతో కిషన్నాయక్తండా, హేమ్లాతండా, దుగ్గాతండా, పొట్పల్లి, నాగన్పల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.