కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గొప్ప మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. నర్సాపూర్లో ఎగిరేది గులాబీ జెండానే అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటకలా చీకట్లు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అని పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీ తీశారు. పట్టణం గులాబీమయమైంది. రోడ్షోలో పాల్గొని మంత్రి హరీశ్రావు సందడి చేశారు.
నర్సాపూర్, నవంబర్ 10: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2001లోనే గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగురవేశామని గుర్తుచేశారు. ఎప్పటికీ నర్సాపూర్లో ఎగిరేది గులాబీ జెండాయేనని అన్నారు. ఈ 20 రోజులు కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించుకుంటే ఐదేండ్లు మీకు సేవ చేసుకుంటామన్నారు.
కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గొప్ప మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. రానేరాదన్న కరెంట్ను తెచ్చి చూపించిండని, వృద్ధులకు ఆసరా పెన్షన్లు రూ.5016కు పెంచుతాడని, అధికారంలోకి రాగానే జనవరి నుంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రూ.400కే గ్యాస్ సిలిండర్, ఇంటికాడికే మంచినీరు, రైతుబీమా, పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు నగదును ఎకరాకు రూ.16వేలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో అనేక సంక్షేమ పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కర్ణాకట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని, తెలంగాణ ప్రజల ముందు నిజం ఒప్పుకున్నారని తెలిపారు. రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని ముందస్తుగా చెప్పారన్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో పొద్దంతా రెండు గంటలు, దొంగ రాత్రి మూడు గంటల కరెంట్ ఇచ్చారని, ఈ దొంగోళ్లు ఇచ్చే కరెంట్తో నేనెట్ల ఏవుసం చేతురా అనే పాటలు వచ్చాయని, మళ్లీ మనకు ఆ కాలం రావొద్దంటే సీఎం కేసీఆర్ సర్కార్ను గెలిపించాలన్నారు.
ఈ రోజు పొలాల వద్ద రైతులు కట్క వేస్తే కరెంటొస్తున్నది.. కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకలా చీకట్లు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అని పిలుపునిచ్చారు. ఆనాడు ఇదే నర్సాపూర్లో ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూసిన ఘటనలు, రాత్రిపూట కరెంట్ కోసం రైతులు పొలాల వద్దకు వెళ్తే పాములు, తేళ్లు కుట్టి మృత్యువాత పడిన ఘటనలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని తెలిసినా ఎవరూ కాంగ్రెస్కు ఓటెయ్యరని, వేస్తే మన కన్ను మనమే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పాడన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే నా గడ్డం గీసుకోనని సవాల్ చేసి, నేడు మాట తప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పని చేసే నిరంతర శ్రామికుడన్నారు. అలాంటి నాయకుడికే మనందరం పట్టం కట్టాలన్నారు. పట్టపగలు రూ.50 లక్షల లంచం ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని, వీరి చేతిలో తెలంగాణ పెడితే బాగుపడదని, ప్రజలు ఆలోచన చేయాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఎంత క్షేమంగా ఉంటుందో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే బాగుంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నిమ్మ ఓటేస్తే మోసపోతారని సూచించారు. గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ అభ్యర్థులు ఎదురుపడితే ఓటెందుకు వేయ్యాలని నిలదీయాలన్నారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం బోరు మోటర్ల వద్ద కరెంట్ మీటర్లు పెడుతానంటే, కేసీఆర్ ప్రాణం పోయినా పెట్టనివ్వనని తేల్చి చెప్పాడని గుర్తుచేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.30 వేల కోట్ల నిధులను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపి, తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, 11సార్లు అధికారంలో ఉండి నీళ్లు, కరెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 11 సార్లు రూ.72 వేల కోట్ల రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశారన్నారు. ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందోనని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపించారన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయంగా అందిస్తే అది దుబారా అని ఉత్తమ్కుమార్ పేర్కొనడం సిగ్గుచేటన్నారు. అదే రేవంత్రెడ్డి రైతుబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం వేస్తున్నాడని, రైతులను అవమానించాడని గుర్తుచేశారు. రైతులందరూ కలసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బొందబెట్టాలని సూచించారు.
ఒకప్పుడు హల్దీవాగులో నీళ్లు లేక పంటలు ఎండిపోయేవని, నేడు కొండపోచమ్మసాగర్ గేట్లు ఎత్తగానే పుష్కలమైన నీరు ప్రవహిస్తున్నాయన్నారు. వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం రైతులు ఒక్క విజిల్ వేయగానే కొండపోచమ్మ గేట్లు ఎత్తి వారి పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. ఎండకాలంలో హల్దీ పారుతుందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన చరిత్ర అని అన్నారు. మల్లన్నసాగర్, గోదావరి నీటితో నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి నీరు అందిస్తామని, కాళేశ్వరం పనులు ఇంకా చారానమందం మాత్రమే ఉన్నాయన్నారు. అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామన్నారు. కోటి కుటుంబాలకు రైతుబీమా తరహా కేసీఆర్ బీమా అందజేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు, రైతుబంధు కింద ఎకరాకు 16వేలు, రేషన్ దుకాణాలల్లో సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.15లక్షలు, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని మ్యానిఫెస్టోను వివరించారు. మెదక్ ఎంపీగా ఎమ్మెల్యే మదన్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇస్తున్నాడని, భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతాలక్ష్మారెడ్డిని సీఎం కేసీఆర్ బరిలో నిలిపారని, ఆమెను భారీ మెజార్టితో గెలిపించి సీఎంకు బహుమానంగా అందిద్దామన్నారు. సునీతారెడ్డిని గెలుపించుకుంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, గ్రామంలోని ప్రతీ ఇంటికి తిరిగి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఎన్నో రెసిడెన్సియల్ పాఠశాలలు సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారన్నారు. సునీతారెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే నర్సాపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తనదన్నారు. 50 వేల మెజార్టీతో సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ దేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరాంరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి సూచించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తుచేశారు. 14 చెక్డ్యాంలు, సీసీ రోడ్లు, బస్సుడిపో, ఫోర్లేన్ రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేసి చూపించామన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తామన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలన్నారు. 16న ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ నర్సాపూర్ వస్తున్నారని, భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే 24 గంటలు ప్రజా సేవలో ఉంటానని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచిన సీఎం కేసీఆర్కు సహకరించిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. దుఃఖ సమయంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, ప్రజలు తన వెన్నంటే ఉండి తనను నడిపించారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనతోనే సాధ్యమన్నారు. 10 ఏండ్లుగా ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎన్నో సమస్యలు పరిష్కరించాడని, చెక్డ్యాం నిర్మాణాలతో నియోజకవర్గ ప్రజల కల సాకారం చేశారన్నారు. ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలు అవగాహన కల్పించి కారు గుర్తుకు ఓటు వేసేలా చూడాలన్నారు. ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.