కొల్చారం, జూన్ 19 : ప్రొటోకాల్ విషయంలో బుధవారం మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో స్టేజీపై ప్రొటోకాల్ పాటించక పోవడంతో నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీపై స్థానిక ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టడం ఏమిటని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ మొదలై తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ఇరుపార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా గొడవకు దిగారు. జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ నాయకులు, జై కాంగ్రెస్ అంటూ అధికార పార్టీ నాయకులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బడిబాట ముగింపు సభ పూర్తి కాకుండానే అతిథులు మధ్యలోనే వెళ్ల్లిపోయారు.
ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చెలాయించడం ఏమిటని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. కొల్చారంలో నూతన ఎంపీపీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గుమ్మడికాయ కొట్టడంపై సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తనను కాదని ఓడిపోయిన అభ్యర్థికి మంత్రి కొండాసురేఖకు కత్తెర అందించి ఎలా రిబ్బన్ కట్ చేయించారు అని ప్రశ్నించారు. అలాగే ఎంపీపీ మంజుల తన చాంబర్లో రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీటీసీ మేఘమాల సంతోష్కుమార్ను కాదని మంత్రి కొండాసురేఖతో కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీ మంజుల అక్కడే నేలపై కూర్చుని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, రవీందర్రెడ్డి ఆమెకు నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్లారు.