సంగారెడ్డి, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ రమణ కుమార్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే, పకడ్బందీగా దర్యాప్తు చేసి, పూర్తి ఆధారాలు సేకరించి చార్జ్షీట్ ఫైల్ చేయాలన్నారు. ఈ ఏడాది 64 కేసులు రాగా, 16ల్లో బాధితులకు రూ.19 లక్షల పరిహారం అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. 48 కేసుల్లో రూ.57 లక్షల 25 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా అన్ని మండలాల్లో ఏదైనా ఒక గ్రామంలో పౌర హక్కుల దినం తప్పనిసరిగా నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు కోరగా, చర్యలు తీసుకుంటామన్నారు.
కమిటీ సభ్యులు సహకరించాలి: ఎస్పీ రమణ కుమార్
అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు కమిటీ సభ్యులు సహకరించి బాధితులు సరైన రీతిలో అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలా చూడాలని ఎస్పీ రమణకుమార్ సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సద్వినియోగమయ్యేలా చొరవచూపాలన్నారు. పోలీస్ శాఖ తరఫున బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్చార్జి అధికారి జగదీశ్, సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డీఎస్పీలు పాల్గొన్నారు.
సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 28: సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులకు కంపెనీ యాక్ట్, సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వాలన్నారు. కంపెనీ యాక్ట్ మేరకు నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు. ఈ కమిటీలో జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కో-చైర్మన్గా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కో-కన్వీనర్గా, సీపీవో కన్వీనర్గా, సభ్యులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఐసీ జనరల్ మేనేజర్, సంగారెడ్డి, ఆర్సీ పురం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈలు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, ఏడీ మైన్స్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పశు సంవర్ధక శాఖ జేడీ, జీఎస్టీ వన్ అండ్ టూ అసిస్టెంట్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.