మెదక్ మున్సిపాలిటీ, జూన్ 15 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి సత్ఫలితాలనిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, విద్యుత్ సమస్యల పరిష్కారం, పబ్లిక్ టాయిలెట్ల కోసం అవసరమైన స్థలాల గుర్తింపు, పట్టణ జనాభాకు అనుగుణంగా ప్రకృతి వనాలు, సకల సౌకర్యాలతో వైకుంఠ ధామా లు, పరిశుభ్రమైన సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయడం, డంపింగ్ యార్డుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో మొక్కలు నాటడం, పట్టణ యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపేన్ జిమ్ల ఏర్పాటు వంటి పనులను గుర్తించి మున్సిపాలిటీలు రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పట్టణ ప్రగతి కార్యక్రమం రూపుదిద్దుకుంది.
భవిష్యత్తుతరాలకు అందించాల్సిన అభివృద్ధి పనుల వివరాలు పకడ్బందీ ప్రణాళికలు ముందుగానే రచించడం, చర్యలు తీసుకోవడం లాంటి పనులు చేపట్టనుంది. అంతేగాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అంతర్గత రహదారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పా టు, సెంట్రల్ లైటింగ్, మురుగుకాలువలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల నివారణ, తాగునీరు, రక్షిత చర్యలు, రోజు వారీ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశభ్రత లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి ఎంతో ఉపయోగపడుతుంది.
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూఫ్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఒక వైపు ప్రతి నెలా పట్టణ ప్రగతి నిధులు, రెండో వైపు ఆర్థికసంఘం నిధులు, మరో వైపు టీయూఎఫ్ఐడీసీ, ఇంకో వైపు పన్నుల రూపంలో సమకూరుతున్న నిధులు వెరసి.. అభివృద్ధికి బాటలుపడ్డాయి. రాష్ట్ర ఆవతరణ తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతోపాటు ఇంతకాలం నిధులు అభివృద్ధిలో వెనుకబడిన మున్సిపాలిటీల్లో సైతం నిధుల రాకతో అభివృద్ధి వేగవంతమైంది.
ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో నాలుగేసి వార్డు కమిటీలు ఏర్పాటు చేసింది. వృద్ధులు, మహిళలు, యువకులు, ప్రముఖులతో ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డు కమిటీలో 15మంది సభ్యులను నియమించారు. ఒక వార్డులో నాలుగు కమిటీల్లో కలిపి 60మంది సభ్యులు ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 32వార్డులు ఉండగా 1920 మంది వార్డు కమిటీలను ఎన్నుకున్నారు.
పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఫరిడవిల్లాలనే ఆశయంతోనే ప్రభుత్వం పట్టణ ప్రగతిని ప్రారంభించింది. ఇప్పటివరకు నాలుగు విడుతలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేపట్టారు. మొదటిసారిగా 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించారు. రెండోసారి ఫిబ్రవరి 25, 2021 నుంచి మార్చి 6 వరకు పట్టణ ప్రగతి నిర్వహించారు. మూడోసారి జూలై 1, 2021 నుంచి పది రోజులపాటు మూడో విడుత నిర్వహించారు. జూన్ 3, 2022 నుంచి పది రోజులపాటు నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణ ప్రగతి అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మున్సిపాలిటీలకు జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేస్తున్నది. అంతేగాకుండా 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థికసంఘం నిధులు విడుదల చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల అభివృద్ధి ముందంజలోకి వెళ్తున్నాయి. ప్రతినెలా ప ట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలకు నిధులు టంచన్గా రావడంతో అభివృద్ధికి సుగమమైంది. ఇప్పటికి నాలుగు విడుతల జరిగిన పట్టణ ప్రగతికి వచ్చిన నిధులతో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మున్ముందు సైతం పట్టణ ప్రగతి నిధులతోపాటు ఇతరాత్ర నిధులు, ఎమ్మెల్యే సహకారం, పాలకవర్గం సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
-చంద్రపాల్, మెదక్ మున్సిపల్ చైర్మన్