మెదక్ మున్సిపాలిటీ, జూన్ 23: సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థిక భారం పడేది. వీటని గమనించిన కేసీఆర్ ప్రభుత్వం రైతువేదికలు నిర్మించి, అందుబాటులోకి తెచ్చింది. నేడు అన్నదాతకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఒక చైతన్య దీపిక వచ్చింది. పంట పండించే నాటి నుంచి ధాన్యం విక్రయించే వరకు సకల సమాచారాన్ని అందిస్తూ, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది రైతు వేదిక. సాగులో అధునాతన పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయాధికారులు ఈ రైతు వేదికల్లోనే అవగాహన కల్పిస్తున్నారు.
ఈ వేదిక కేంద్రంగా వారంలో రెండు రోజులు వ్యవసాయాధికారులు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంటలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆయిల్పామ్ సాగుపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ రైతు వేదికల్లో ఇక నుంచి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిధిలోని 42 శాఖలు క్లస్టర్ స్థాయి సమావేశాలకు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నది. దీంతో రైతు వేదికలు ఇక ప్రభుత్వ శాఖల కార్యక్రమాలకు వేదికలుగా మారనున్నాయి.
5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. మెదక్ జిల్లాలో 76 క్లస్టర్లకు 76 రైతు వేదికలు నిర్మించింది. ఒక్కో వేదికకు ప్రభుత్వం రూ.22 లక్షలు వెచ్చించింది. నిర్వహణకు ప్రతి నెలా రూ.9 వేలు అందిస్తున్నది. జిల్లాలో 21 మండలాలు, 469 గ్రామ పంచాయతీలుండగా 76 రైతు వేదికలు నిర్మించారు.
రైతు వేదికల్లో ప్రస్తుతం వ్యవసాయ శాఖకు సంబంధించి సమావేశాలే నిర్వహిస్తున్నారు. ఏటా భూసార పరీక్షలకు సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఉత్తర్వులతో రైతు వేదికలు అన్ని ప్రభుత్వ శాఖల సమావేశాలు, కార్యక్రమాలకు వేదిక కానున్నాయి.
రైతు వేదికల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు సైతం సమావేశాలు, కార్యక్రమా లు నిర్వహించకోవచ్చని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు లు అందాయి. వీటిని ఆ యా శాఖల అధికారులకు చేరవేశాం. ఆయా ప్రభు త్వ శాఖలు సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణ గురించి వ్యవసాయ శాఖను సంప్రదించి, సమావేశాల వివరాలు అందిస్తే, వాటికి అనుగుణంగా రైతు వేదికలు కేటాయిస్తాం.
– ఆశా కుమారి, మెదక్ జిల్లా వ్యవసాయాధికారిణి