మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యాక్సిన్ చిన్నా రుల ప్రాణానికి రక్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం పీవీసీ వ్యాక్సిన్ తీసుకొచ్చింది. చిన్నారుల్లో అంటు వ్యాధు లు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యతో పాటు శ్వాస సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు న్యూమోకో కల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ)ను పంపిణీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇప్పటికే కలెక్టర్ హరీశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పుట్టిన ఆరు వారాలకు మొదటి డోసు..
పుట్టిన ఆరు వారాలకు మొదటి డోసు, 14వారాలకు రెండో డోసు, తొమ్మిది నెలకు మూడో డోసును వేయించాలి. ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మోతాదు పీసీవీని వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వవచ్చు. అయితే పీసీవీ టీకాను కేవలం ప్రైవేట్ దవాఖానల్లో మాత్రమే చిన్నారులకు ఇచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాల్లోనూ వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి జిల్లాలో పీసీవీ టీకా వేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1750 డోసులు అందుబాటులో ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు
టీకాతో మరణాల శాతం తగ్గే అవకాశం…
న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) టీకాతో మరణాల శాతం తగ్గే అవకాశముంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లో బ్యాక్టీరియా పరాన్నజీవులు, జీర్ణాశ యంలోకి ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల జలుబు ముదిరి నిమ్మ సమస్య ఏర్పడుతుంది. అయితే దీని నివారణకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వీటి ఖరీదు రూ.2500 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది. అయితే చాలా మంది పిల్లలు న్యూమోనియా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పీసీవీ టీకాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఈ టీకాను పంపిణీ చేయనున్నారు.
పీసీవీపై విస్తృత ప్రచారం..
న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) టీకాను విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద పీసీవీ టీకా ఆవశ్యకతపై అవగాహన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. టీకా గురించి ఆశాకార్యకర్తలు, ఎఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
న్యూమోకోకల్ వ్యాధి అనేది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం, న్యూమోనియాకు జ్వరం, వణుకు, దగ్గు, మైనింజైటీస్కు జ్వరం, తల నొప్పి, కాంతిని భరించలేకపోవడం, మెడగట్టి పడడం, మూర్చ వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న చినారులకు సరైన సమయంలో చికిత్స అం దించలేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు పూర్తి.. డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పీసీవీ టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీసీవీ టీకాను పంపిణీ చేస్తాం. జిల్లాకు 1750 పీసీవీ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ఏడాదిలోపు మూడు డోసులు తీసుకోవాలి. ఇప్పటికే జిల్లా వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత టీకాను సద్వినియోగం చేసుకొని చిన్నారులకు అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడాలి.