ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్కుమార్, రాజర్షి షా, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం మొదటి విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు ఈ నెల 10వ తేదీలోగా చెక్కులు పంపిణీ చేయాలని సూచించారు. గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రభుత్వం మూడు వేల ఇండ్లు మంజూరుచేసిందని తెలిపారు. రెండో విడుత దళితబంధు ప్రక్రియను వేగవంతం చేసి, 1100 మంది లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 7: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయానికి సంబంధించి మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ నెల 10లోగా చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆగస్టు 10 నుంచి 20 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. అదేవిధంగా రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళితబంధు అందించాలని, లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లాలో రెండో విడత దళితబంధుకు 3,787 దరఖాస్తులు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత దళితబంధుకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 1100 చొప్పున 5500 మంది లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3,787 దరఖాస్తులు జిల్లాలో అందాయన్నారు. అందులో 2,571 దరఖాస్తులను పరిశీలించడం పూర్తయిందన్నారు. పరిశీలన పూర్తయిన దరఖాస్తులన్నింటినీ వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. ఈ వారంలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. బీసీ కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించి 299 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ వారంలోగా ఈ నెల జిల్లా లక్ష్యం మేరకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటివరకు జిల్లాకు 366 యూనిట్లు వచ్చాయని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో నగేశ్, డీఆర్డీవో, డీపీవో, వివిధ శాఖల అధికారులున్నారు.