రామాయంపేట, డిసెంబర్ 13: కార్తిక మాసం పుణ్యమా అని చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్లెస్ రూ.240 ఉండగా, కార్తికమాసం ముగిసే సమయంలో అమాంతం కిలో రూ.180కి దిగొచ్చింది. లైవ్ ధర ఒక్కసారిగా రూ.120 తగ్గడంతో చికెన్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, ధరలు పడిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని చికెన్ దుకాణం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు వినియోగదారులకు సంతృప్తి కలిగిస్తున్నప్పటికీ తగ్గుతున్న ధరలు కోళ్ల ఫారాల రైతులను కుదేలు చేస్తున్నాయి. లేయర్ కోళ్ల పెంపకందారుల పరిస్థితి ఒకరకంగా ఉన్నా బాయిలర్ రైతులు మాత్రం నష్టాల పాలవుతున్నారు. కార్తికమాసం కావడంతో గిరాకీ లేక చికెన్ సెంటర్ నిర్వాహకులు ఊసూరుమంటున్నారు. పౌల్ట్రీ ఫారాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడంతో కోళ్ల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతుండడం, హైదరాబాద్తో పాటు పట్టణాల నుంచి పెద్దపెద్ద సంస్థలు మండలం, గ్రామాలకు వచ్చి మరీ కోళ్లను దుకాణదారులకు విక్రయిస్తుండడం ధరల తగ్గుదలకు కారణాలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా ఫౌల్ట్రీ రైతులకు ఈ సీజన్ కష్ట కాలమేనని చెప్పవచ్చు. రామాయంపేట డివిజన్ పరిధిలోని నార్సింగి, రామాయంపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట ఎక్కడ ఏ గ్రామంలో చూసినా చికెన్ సెంటర్లు అధికంగా కనిపిస్తాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు పెద్దగా నష్టం లేకపోయినా రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన ఫౌల్ట్రీ రైతులు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లైవ్కోళ్ల ధర కూడా దాదాపు కిలో రూ.వంద లోపే విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, పరిశ్రమలు పెట్టుకున్న వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటు చికెన్ ధరలు పడిపోతుంటే అటు కోడి గుడ్డు ధరలు మాత్రం అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. గతంలో ఒక్కో గుడ్డు రూ.4 నుంచి 5 ఉండగా, ప్రస్తుతం రూ.6కు చేరింది. దీంతో ఒకప్పుడు కోడిగుడ్ల కూరతో సరిపెట్టుకున్నవాళ్లు ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు. మరో వారం పది రోజులపాటు చికెన్ ధర తగ్గడం, కోడి గుడ్డు ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.