చేర్యాల, డిసెంబర్ 3 : వివిధ పద్ధతుల్లో సైబర్ నేరాలు చేసిన కేసులను చేర్యాల పోలీసులు చేధించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.88,500 రికవరీ చేశారు. సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ శనివారం వివరాలు వెల్లడించారు. కొమురంభీమ్ జిల్లా రవీంద్రనగర్కు చెందిన విద్యార్థి (17) మైనర్. అతడికి బ్యాంకు అకౌంట్ ఇవ్వకపోవడంతో పక్కింటికి చెందిన సుజాతరాయ్ పేరుమీద తన ఫోన్ నెంబర్ సహాయంతో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేశాడు. సదరు అకౌంట్ ద్వారా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో యూట్యూబ్లో హ్యాక్ ఏలా చేయాలో వీడియోల ద్వారా నేర్చుకున్నాడు. ట్రూ కాలర్ సహాయంతో రాండంగా 10 నెంబర్లకు ఎం ట్రీ చేస్తే ఎవరైతే వాళ్ల మెయిల్ అకౌంట్కు ఫోన్ నెంబర్ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఇతడి ట్రూకాలర్ ద్వారా వారి మెయిల్ అకౌంట్లోకి వెళ్లి అకౌంట్ను ఇన్సర్ట్ చేసి తన అకౌంట్ పాస్వర్డ్తో లాగిన్ కాగానే ఓటీపీ తన ఫోన్ నెంబర్కు వస్తుంది.
ఈ అకౌంట్కు ఎవరైనా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తే సుజాతరాయ్ అకౌంట్లోకి వెళ్లాయి. వచ్చిన డబ్బులు తీసుకొని జల్సా లు చేసేవాడు. ఈ ప్రాసెస్లో భాగంగా చేర్యాల చెందిన బచ్చు మురళి అకౌంట్ను నిందితుడు తన అకౌంట్లోకి మార్చుకున్నాడు. బచ్చు మురళి తన స్నేహితుడికి పంపించిన రూ.40వేలు సుజాతరాయ్ అకౌంట్లోకి వెళ్లాయి. రమేశ్ తాళ్లపల్లి అనే వ్యక్తి అకౌంట్ను సైతం ఇదేవిధంగా చేయడంతో అతడు తన మిత్రుడికి పంపిన రూ.40వేలు సైతం సుజాతరాయ్ అకౌంట్కు వెళ్లాయి. సైబర్ నేరం జరిగిందని మురళి, రమేశ్ జాతీయ హెల్ప్ నెంబర్కు ఫిర్యాదు చేయడంతో రూ.80వేలు ఫ్రీజ్ చేసినట్లు చేశారు. అనంతరం సైబర్ నేరంపై కేసు నమోదు చేసుకొని సీఐ శ్రీనివాస్, ఎస్సై భాస్కర్రెడ్డి, టెక్నాలజీ ద్వారా నిందితుని వివరాలు కనుక్కొని చాకచక్యంగా పట్టుకుని అతడి వద్ద రూ.11,600 రికవరీ చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామానికి చెందిన తాడూరి పృథ్వీరాజ్ పీఎంపీ డాక్డర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన దవాఖాన పక్కన ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేయడానికి వచ్చేవారు. దీన్ని చూసి ఏవో పేరిట ఫర్టిలైజర్ షాపుల వద్ద డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరు నెలలుగా ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకుల ఫోన్ నెంబర్లు తీసుకుని తాను ఏవో శ్రీనివాస్రెడ్డిని మాట్లాడుతున్నాని, తన కారులో పెట్రోల్ లేక ఆగిపోయిందని, పెట్రోల్ పోయించాలని జగిత్యాలలో ఉన్న షాపుకు నిర్వాహకుడికి ఫోన్ చేశాడు. సదరు పెట్రోల్ పంపు యజమానికి రూ.3500 పంపించాడు. ఖమ్మం జిల్లా మర్కాపురం ఫర్టిలైజర్ షాపు కు ఫోన్ చేసి ఇదే పద్ధతిలో పెట్రోల్ పోయించుకున్నారు.
మూడు నెలల క్రితం సిద్దిపేట పొన్నాల వద్ద ఉన్నానని, చేర్యాలలోని సాయిరాం ఫర్టిలైజర్ షాపునకు ఫోన్కు చేసి డీఏవో ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని, కారు రిపేర్లో ఉందని మెకానిక్ వచ్చి రిపేర్ చేశాడు. రూ.3800 పంపిస్తే చేర్యాలకు వచ్చి ఇస్తానని నమ్మించి అతడి సమీప బంధు వు అనిల్కు ఫోన్ చేసి డబ్బులు ఫోన్ పే చేయించుకున్నాడు. చేర్యాల ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు డీఏవో కార్యాలయంలో అతని గురించి ఆరా తీయగా, ఎవరూ లేరని తెలియడంతో చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పృథ్వీరాజ్ తప్పించుకుని పారిపోయేందుకు యత్నించగా, అతడిని పట్టుకొని విచారించగా, సైబర్ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి ఫోన్తో పాటు రూ.3800 రికవరీ చేశారు.