రామాయంపేట, జనవరి 10: దేశంలో రవాణా రంగ కార్మికుల పొట్టను కొట్టేందుకు కేంద్రం దుర్మార్గమైన కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రవాణా రంగ సంఘర్షయాత్ర రామాయంపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ఆటో, ఆటో ట్రాలీ, లారీ గూడ్స్, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులతో రవాణా రంగంలో ఉన్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాలకు కూడా కార్మికుల ప్రయోజనార్థం బస్సులను నడిపించాలన్నారు. ప్రయాణ సౌలభ్యానికి ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్మికుల పొట్టకొట్టేందు కోసం నూతనంగా తీసుకువస్తున్న చట్టాలను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు.
కేంద్రం తెచ్చిన మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ చట్టం రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైందన్నారు. ఈ చట్టంతో కార్మికుడికి రోడ్డు ప్రమాదం జరిగితే విచారణ లేకుండానే డ్రైవర్పై కేసు నమోదవుతుందన్నారు. ఇలాంటి చట్టాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదని, అనవసరంగా కార్మికుల పొట్ట కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం రవాణా రంగ కార్మికులతో ఆటలాడుతుందన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంవరించకుంటే జాతీయ రహదారులను నిర్భందిస్తామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రవాణా రంగాల డ్రైవర్లు ఒక్కటై ఈ చట్టాన్ని తొలగించే వరకు పోరాడుదామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు బాలమణి తదితరులున్నారు.