త్వరలో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం
రైతులపై మరింత ఆర్థిక భారం
సాగు విస్తీర్ణం పెరగడంతో రసాయనిక ఎరువులకు డిమాండ్
గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,70,550 మెట్రిక్ టన్నుల వినియోగం
సంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతో పాటు రైతులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రసాయనిక ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలకు భారీగా కోత విధించింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్కు రసాయనిక ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది వరకే ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కేంద్రం ఎరువులపై సబ్సిడీ కోత విధించడంతో త్వరలో రసాయనిక ఎరువుల ధరలు మరింత పెరుగనున్నాయి. ఇది రైతులకు పెనుభారం కానున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లాకు సాగునీరు అందుతున్నది. దీంతో సిద్దిపేట జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో సైతం సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల ద్వారా పొలాలకు సాగునీరు ఇస్తున్నారు. జిల్లాలో చిన్ననీటి వనరుల ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మెదక్ జిల్లాలో సైతం వనదుర్గా (ఘనపురం) ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ ద్వారా పంటపొలాలకు సాగునీరు అందిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, ప్రస్తుతం సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనికి తోడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంతో జిల్లాలో రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. ప్రభుత్వం సేంద్రియ ఎరువులను ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు ఇంకా రసాయనిక ఎరువులను వాడకం తగ్గించడం లేదు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రసాయన ఎరువులకు డిమాండ్ ఉంది. 2020-21లో ఎరువుల అమ్మకాలను పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలోని రైతులు యాసంగి (రబీ), వానకాలం (ఖరీఫ్) సీజన్లో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్, ఎస్ఎప్పీ ఎరువులను మొత్తం 1,20,920 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల ఎరువులను 1,43,403 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మెదక్ జిల్లా రైతులు గతేడాది మొత్తం 1,06,227 మెట్రిక్ టన్నుల ఎరువులు కొనుగోలు చేశారు. రాబోయే సీజన్లలో సైతం రైతులు ఎరువులు వాడకం తప్పనిసరి. ఎరువులు వాడితేనే పంటల ఎదుగుదలతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతుల నమ్మకం. దీంతో రైతులు రసాయనికి ఎరువుల వాడకం వైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై ధరలు క్రమంగా పెంచుతుండడంతో రైతులకు ఆశనిపాతంగా మారింది. యూరియా ధరలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ రసాయనిక ఎరువులు తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరిగాయన్న నెపంతో ఇటీవలే ఎరువుల ధరలను 50శాతం పెంచింది. పెరిగిన ఎరువుల ధరలతో రైతులకు ఒక్కో పంటపై సుమారు రూ.3వేల వరకు అదనపు భారం పడింది. పొటాష్ ధర రూ.850 పెరగగా, కాంప్లెక్స్ ఎరువులు రూ.650 వరకు పెరిగాయి. 50 కేజీల డీఏపీ ధర గతంలో రూ.1200 ఉండగా, దానిని ఏకంగా రూ.1900కు పెంచింది. ఒక బస్తాపై ధర రూ.700 పెరిగింది. ఇది వరకే ధరలు పెరిగి రైతులు ఇబ్బంది పడుతుంటే, కేంద్రం తాజాగా బడ్జెట్లో సబ్సిడీ నిధుల్లో కోత విధించడంతో ఎరువుల ధరలు మరింత పెరగనున్నాయి.
బడ్జెట్లో సబ్సిడీ నిధులకు కోత
కేంద్రం మంగళవారం ప్రకటించిన బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీకి భారీగా కోత విధించింది. గత బడ్జెట్లో కంటే ఎరువులపై సబ్సిడీ నిధుల్లో రూ.29వేల కోట్లు తక్కువగా కేటాయించింది. దీంతో ఎరువులపై రాయితీ తగ్గి ధరలు పెరగనున్నా యి. వచ్చే వానకాలం(ఖరీఫ్) సీజన్ నుంచి ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు కొన్ని రకాల ఎరువులపై పూర్తిగా సబ్సిడీని కేంద్రం ఎత్తివేసే యోచనలో ఉందని అంటున్నారు. ఇదే జరిగితే రైతులపై మరింత ఆర్థికభారం పడనుంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను 50 శాతం మేర పెంచింది.తాజాగా ఎరు1:22 AM 2/4/2022వుల రాయితీకి నిధులను తగ్గించింది. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో యూరియా సబ్సిడీ రూపేణా కేంద్ర ప్రభుత్వం రూ.75వేల కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.63వేల కోట్లే కేటాయించింది. కాంప్లెక్స్ ఎరువులకు గతేడాది బడ్జెట్లో రూ.64వేల కోట్ల సబ్సిడీ కేటాయిస్తే, తాజాగా కేవలం రూ.42వేల కోట్లు ప్రకటించింది. సబ్సిడీ ని ధులు భారీగా కోత విధించడంతో ధరలు మరింత పెరిగి రైతులకు భారం తప్పదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు, రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే యూరియా ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.