మెదక్ : జిల్లాలో నమోదవుతున్న కేసుల ( Cases ) దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ( SP Srinivas Rao ) పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన క్రైమ్ రివ్యూ ( Crime Review ) సమావేశంలో జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, మిస్సింగ్ కేసులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ అమలు చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్సింగ్ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంతో చేపట్టి, అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావు లేకుండా చట్టపరమైన గడువుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మాన్యువల్ రికార్డులు సీసీటీఎన్ఎస్ నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు.
రానున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో సమన్వయం చేసి ఎక్కువ సంఖ్యలో కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా ఎన్సీఆర్పీ (NCRP) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నెంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందేలా ప్రతి కాల్ను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, రేణుక రెడ్డి, సందీప్ రెడ్డి, రంగా కృష్ణ, సైదా, మహేష్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.