సిద్దిపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి తమ సం పూర్ణ మద్దతను తెలియజేయడంతో పాటు తామంతా సీఎం కేసీఆర్ వెంటే అని చాటి చెప్పారు. భారీ బహిరంగ సభకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం సభ ఇన్చార్జిగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వారం రోజుల పాటు ఖమ్మంలోనే ఉండి సభ గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఆహోరాత్రులు శ్రమించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్నర్సన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు ఖమ్మం ఆవిర్భావ బహిరంగ సభకు తరలివెళ్లారు. ఖమ్మలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ ఒక చారిత్రాత్మక సభ అని చెప్పవచ్చు. ఇంత పెద్ద సభల నిర్వహణ అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీకే సొంతం అని చెప్పాలి అన్నట్లుగా నిర్వహించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పునకు ఈ సభ ఒక సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది ఒక అద్భుత బహిరంగ సభగా పార్టీ శ్రేణులు అభివర్ణించారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని సభ ద్వారా స్పష్టమైందని వారు అంటున్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఎక్కడికక్కడ ప్రజలు తరలివచ్చి ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి సీఎం కేసీఆర్, ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు, రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదింట పెద్దన్నలా సీఎం కేసీఆర్ నిలిచారు. పేద ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ కొలువై ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీకి స్థానం లేదని ఖమ్మం సభ ద్వారా మరోసారి ప్రజలు చాటి చెప్పారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీ మరోసారి కైవసం చేసుకోవడం ఖాయం అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ కొడుతుందని పార్టీ శ్రేణలు ఉత్సాహంగా చెబుతున్నారు.