నర్సాపూర్, ఆగస్టు 18 : ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నర్సాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం చేశారని గుర్తుచేశారు.
హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేయకుండా ఈ పథకాలు రద్దు చేసేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్, మహిళలకు న్యూట్రీషన్ కిట్ వంటి పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాటలేమో కోటలు దాటుతున్నా, పథకాలు మాత్రం గడపదాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతి బహిరంగ సభలో మహిళలకు కోటీశ్వరులను చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని, ఇప్పటి వరకు ఒక్క మహిళనైనా కోటీశ్వరులను చేశారా అని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. తులం బంగారం ప్రభుత్వం బాకీ పడిందన్నారు. పాత రేషన్కార్డులపైనే సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టి కొత్త రేషన్కార్డులని పంపిణీ చేస్తున్నారని, ప్రభుత్వ ప్రచార ఆర్భాటం వల్ల ఖజానాపై రూ.15కోట్ల భారం పడినట్లు చెప్పారు.
ఇటీవల సంగారెడ్డి పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి పైసా నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని సునీతాలక్ష్మారెడ్డ మండిపడ్డారు. నోరు విప్పితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావును తిట్టడమే సీఎం పనిగా పెట్టుకున్నావని విమర్శించారు. సరిగ్గా 12 గంటల కరెంట్ ఇవ్వడం చేత కావడం లేదని, పంట రుణమాఫీ కోసం రూ.40వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి కేవలం, రూ.26వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, ఇంకా గ్రామాల్లో పంటరుణామాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
2లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. నాయకులు దేవేందర్రెడ్డి, చ్రందాగౌడ్, మన్సూర్, చంద్రశేఖర్, రమణాగౌడ్, మధుసూదన్రెడ్డి, రామచంద్రారెడ్డి,శివకుమార్, సత్యంగౌడ్, జితేందర్రెడ్డి, జీవన్రెడ్డి, పరమేశ్వర్రాజు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.