మెదక్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో మాట్లాడారు. 25 ఏండ్లుగా ఉద్యమంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదురొన్నామని, అధైర్యపడకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆడబిడ్డగా ఆదరించి సహకరించారన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. ఓటమిని గెలుపుగా భావిస్తూ ముందుకు వెల్దామని కార్యకర్తలు, నాయకుల కు సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడకుండా ప్రజలకు అండగా నిలవాలన్నారు. ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.