మద్దూరు(ధూళిమిట్ట), మే11: ఆడబిడ్డకు అన్యాయం చేసిన కొడుకును వెనుకేసుకొస్తున్న బండి సంజయ్ని కేంద్రమంత్రి వర్గం నుంచి తొలిగించాలని బీఆర్ఎస్ మద్దూరు, ధూళిమిట్ట మండలాల అధ్యక్షులు మేక సంతోష్కుమార్, మంద యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్ పదవిలో ఉంటే కొడుకుపై విచారణ నిష్ర్పక్షపాతంగా జరగదని, వెంటనే ప్రధాని స్పందించి బండి సంజయ్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బాధితురాలిని బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ను మధ్యవర్తిత్వం వహించిన సంగప్పను కేసులో సహ నిందితులుగా చేర్చాలన్నారు. బాధితురాలికి అన్యాయం చేసే విధంగా కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను విధుల నుంచి తొలిగించాలన్నారు. బండి సంజయ్కు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు సపోర్టు చేయడం సిగ్గుచేటన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ఏమైనా జరిగితే బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని సాయి భగీరథ్ అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మైనర్బాలికకు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్లు దామెర మల్లేశం, బర్మ రాజమల్లయ్య, గడిపె మౌనికాఅనిల్, కర్నె సునీతామనోహర్, ఉపసర్పంచ్లు షకిల్ ఆహ్మద్, శెట్టె ఐలయ్య, గొడుగు బాలరాజు, మాచర్ల రఘు, పీఏసీఎస్ డైరెక్టర్ దేవదాసు, మాజీ సర్పంచ్లు వంగ బాల్రెడ్డి, జీడికంటి సుదర్శన్, నాయకులు పుట్ట వెంకటరమణారెడ్డి, నల్ల బాల్రెడ్డి, జిలానీ సిద్ధిఖీ, బొడికె ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.