అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నియోజకవర్గ ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జెండాల ఆవిష్కరణ, భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. సమావేశాల సందర్భంగా సభాస్థలి ప్రాంతాలను పార్టీ జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నట్లు తెలిపారు. కాగా, మేడ్చల్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 3వేల మంది హాజరయ్యేలా ప్రణాళికలు
సిద్ధమయ్యాయి. ్రప్రతినిధుల సమావేశాన్ని పండుగలా నిర్వహిస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోమవారం తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10గంటలకు ప్రతినిధుల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సమావేశాల సందర్భంగా సభాస్థలి ప్రాంతాలను పార్టీ జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని సూచించారు. గడిచిన 50 ఏండ్లల్లో జరగని అభివృద్ధి, సంక్షేమం… రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించే ఫొటో ఎగ్జిబిషన్ను ఈ సమావేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఆవిషరించిన అనంతరం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పార్టీ నాయకులు భారీ ర్యాలీలతో సమావేశం వద్దకు చేరుకుంటారని తెలిపారు.
నియోజకవర్గ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సమావేశం
మేడ్చల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): నేడు జరిగే బీఆర్ఎస్ సభలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నియోజకవర్గ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం జరిగే బీఆర్ఎస్ సమావేశాలకు ముందు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగిరేసి మోటర్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున ప్రతినిధులు, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సమావేశానికి వచ్చే వారందరికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సమావేశాలకు మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నవీన్కుమార్, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ జెండాల గద్దెలకు గులాబీ రంగులు వేసి సిద్ధం చేశారు.
కార్యసాధకుడు సీఎం కేసీఆర్ దాసోజు శ్రవణ్
అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని నిరుపేదలు ఆర్థిక స్థిరీకరణ సాధించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. సంక్షేమ ఫలాలను రాష్ట్ర నలుమూలలా అమలు చేస్తున్న ఘనత ఆయనకే సొంతమన్నారు. ప్రతినిధుల సమావేశంలో పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జరిగిన తీరుతెన్నులపై ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనే అంశంపై చర్చ జరుగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఈ సమావేశంలో వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షను కూడా చర్చించనున్నట్లు చెప్పారు.
పండుగలా నిర్వహిస్తాం
నేడు జరిగే గులాబీ జెండా పండుగ, ప్రతినిధుల సమావేశాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పండగలా నిర్వహిస్తాం. మంగళవారం ఉదయం గులాబీ జెండాలను ఆవిష్కరించి భారీగా ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు విజయవంతం అయ్యేలా చూస్తున్నాం.
– కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి