వలసలు నివారించడం, పల్లెలోనే ఉపాధి కల్పించడానికి గ్రామీణ పేదల కోసం యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం ఈజీఎస్ను వదిలించుకోవడానికి బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అనేక కొర్రీలు, సవాలక్ష ఆంక్షలు విధించి పథకం అమలులో రాష్ర్టాలను ఇబ్బందులు గురిచేస్తుండగా.. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి మోదీ సర్కారు భారీగా నిధులు తగ్గించింది. వీటన్నింటిని చూస్తుంటే పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. తద్వారా పేదలు ఉపాధి కోల్పోయి మళ్లీ వలసబాట పట్టే అవకాశం ఉంది. ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తుండడంతో ఈ పథకం నీరుగారి పోయే అవకాశం ఉంది. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండ్, విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెట్టింది. రైతుల మేలుకోరి రాష్ట్ర సర్కారు ఈ నిధులతో పంట కల్లాల నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మెదక్ జిల్లాలో 3,23,494 మంది, సంగారెడ్డి జిల్లాలో 4.18 లక్షల మంది కూలీలు ఉన్నారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం, స్థానికంగా ఉపాధి కల్పించడానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నది. ఏటికేడు బడ్జెట్లో ఈ పథకానికి నిధులను తగ్గిస్తున్నది. 2021-2022 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ. 98, 468కోట్లు ఖర్చు చేసింది. తర్వాత ఏడాది బడ్జెట్లో రూ. 73, 000 కోట్లు ప్రకటించింది. తాజా బడ్జెట్లో కేవలం రూ. 60, 000కోట్లనే కేటాయించింది. దీనిని చూస్తుంటే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్లో భారీగా నిధులను తగ్గించడంతో ఆ ప్రభావం గ్రామీణ ప్రాంత కూలీలపై పడనుంది. కేంద్రం నిర్ణయంతో కూలీలు ఉపాధి కోల్పోనున్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో 1,61,101 జాబ్కార్డులు ఉన్నాయి. ఇందు లో కూలీలు 3,23,494 ఉన్నారు. ఈ ఏడాది పనిదినాల టార్గె ట్ 35,67,595 కాగా,ఇప్పటి వరకు 37,61,583 పనిదినాలు కల్పించారు. ప్రస్తుతం 3273 మందికి పని కల్పిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 2.25లక్షల జాబ్కార్డులు ఉండగా, ఇందులో యూక్టివ్ జాబ్కార్డులు 1.34 ఉన్నాయి. మొత్తం కూలీలు 4.18 లక్షలు కాగా, క్రియాశీల కూలీల సంఖ్య 2.33లక్షలు ఉంది. రూ. 11404లక్షలతోని, 21000 పనులు చేయాల్సి ఉంది.
వలసల నివారణలో కీలక పాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం కీలకంగా నిలుస్తున్నది. ఈ పథ కం ప్రారంభమైన తర్వాత వలసలు తగ్గుముఖం పట్టాయి. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఉన్న చోటనే పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి కీలక పథకా న్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుండటంతో పేదలకు ఉపాధి కరవవుతున్నది. కరోనా సమయంలో ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొం తూళ్లకు వచ్చారు. అప్పట్లో వారికి ఈజీఎస్ వరంలా మారింది. ఈజీఎస్లో తెలంగాణ ప్రాంతంలో పనులు బాగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో వివిధ పనులను చేపట్టి దేశ స్థాయిలోనే అనేక అవార్డులు సొంతం చేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు కాకుండా తెలంగాణకు అవార్డులు రావడం ఏంటీ అని కేంద్రంలోని బీజే పీ పెద్దలకు తట్టింది. ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలంగాణపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. రోజుకో నిబంధన తెచ్చి ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నది. తాజాగా నిధులు తగ్గించడంతో కేంద్రం వంకర బుద్ధి బయటపడింది.
నిబంధనలు కఠినతరం
రాష్ర్టాల ప్రమేయం లేకుండా ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా కేంద్రమే తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ పథకాన్ని నిర్వీర్యం తీసేయాలన్న ఆలోచనతో ఏటికేడు నిధుల కేటాయింపులను తగ్గిస్తున్నది. గ్రామాల్లో జరిగే పనుల్లో ఎక్కువగా కూలీలు భాగస్వామ్యం ఉంటుంది. కొత్త నిబంధనలతో కూలీలు రోడ్డున పడుతున్నారు. పని ప్రారంభించాక.. పని ముగిశాక అక్కడే ఉండే కూలీలు గ్రూప్ ఫొటోతీసి అప్లోడ్ చేస్తేనే వారికి కూలీ పడుతున్నది. సరాసరిగా పనిచోట ప్రతికూలీ 5గంటలు పని చేయాల్సిందే. అలా చేస్తేనే అతనికి కూలీ పడుతుంది. పని ప్రదేశానికి కూలీలు వెళ్లిన వెంటనే వారిని క్రమపద్ధ్దతిలో నిలబెట్టి మేట్లు, పంచాయతీ కార్యదర్శులు ఫొటోతీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేశాక ఒక్కో కూలీ పేరుతో హాజరు నమోదు చేసి సాఫ్ట్వేర్కు అనుసంధానం చేసి ఆన్లైన్లో మాస్టర్లు పంపిస్తారు. ఇలా చేశాక కూలీ లు చేసే పనిని, ఎంతమంది కూలీలు చేస్తున్నారు అనే గ్రూప్ ఫొటోను తీసి పంపుతారు. ఆ తర్వాత వారు చేసిన పని పూర్తయిన తర్వాత ఆ ఫొటోను తీస్తారు. ఇలా ప్రతి పనిని సాంకేతిక ప్రక్రియ ద్వారా చేస్తేనే కూలీలకు ఒకరోజు మాస్టరు ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో నమోదవుతున్నది. ఇక గ్రామాల్లో మెటీరియల్ కంపోనేట్తో చేపట్టే పనుల విషయానికి వస్తే నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం ఒకపని మంజూరు చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ, గ్రామసభ తీర్మానాలతో పాటుగా సుమారుగా 29రకాల పేపర్లు సబ్మిట్ చేస్తే కమిటీ కూర్చుండి ఆ పనిని మంజూరు చేయాలా..? వద్దా…? అని పరిశీలించి దానికి ఆమోదం తెలిపితేనే ఆ పనిని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలా కఠినతర నిబంధనలు రావడంతో గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇతర పనులు చేట్టాలంటే నానా ఇబ్బంది అవుతున్నది. గతంలో చెరువుల, కాల్వల పూడికతీత పనులు చేపట్టే వారు. ఇప్పుడు వీటికి కేంద్రం అభ్యంతరాలను తెలుపుతున్నది. రైతుల సౌకర్యార్ధం వ్యవసాయ బావుల వద్ద కల్లాలను ఏర్పాటు చేసుకుంటే, వాటి బిల్లులు రికవరీ చేయాలని చెప్పి రికవరీ రాశాయి కేంద్ర బృందా లు. ఇలా నిబంధనలు కఠినతరం చేసి, అనేక కొర్రీలు పెడుతూ ఉద్దేశ పూర్వంగా ఈజీఎస్ను నీరుగార్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తున్నది.
పథకంలో అనేక కొర్రీలు
ఉపాధిహామీ పథకం పనులపై కేంద్ర ప్రభుత్వం చీటికి మాటికి కొర్రీలు పెడుతున్నది. దీంతో పనులు ముందుకు కదలడం లేదు. ఉపాధిహామీ పథకాన్ని వ్య వసాయానికి అనుసంధానం చేయాలనే విజ్ఞప్తులు, డిమాండ్లను పెడచెవిన పెట్టింది. రైతులకు ఉపయోగపడే పనులను తెలంగాణ ప్రభుత్వం చేపడితే, వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి అధికారుల బృందాలను పంపించి తనిఖీలు చేయించింది. కూలీలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నది.కొత్త కొత్త సాఫ్ట్వేర్లను తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈజీఎస్ కింద గ్రామాల్లో ఒకపని చేపట్టాలంటే సుమా రుగా 29రకాల పేపర్లు సమర్పిస్తే గాని మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. ఒక పని పూర్తి చేశాకే మరోపని చేపట్టాలనే నిబంధన విధించింది. ఆ తర్వాతే కొత్త పనిని చేపట్టేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసింది. ఇది వరకు గ్రామా ల్లో ఎన్ని పనులైనా ఈజీఎస్లో చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం కేంద్రం తెచ్చిన నిబంధనలతో అన్ని పనులు కూలీలు చేయలేరు. ఫలితంగా కూలీలకు పనులు దొరకుకుండా పోతాయి. తద్వారా మళ్లీ వాళ్లు వలస పోవా ల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.