సిద్దిపేట, మే 23: ఈ భూమిపై ఏది వృథా కాదు.. ఆలోచిస్తే చెత్తను సైతం ఆదాయ వనరుగా మార్చవచ్చని సిద్దిపేట పురపాలక సంఘం నిరూపిస్తున్నది. సీఎన్జీ బయో గ్యాస్ ప్లాంట్ను కార్బన్ మాస్టర్స్ -సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లో ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలుగకుండా తడి చెత్తతో సీఎన్జీ బయోగ్యాస్ తయారు చేసి, హోటళ్లకు విక్రయిస్తున్నారు.
నేడు సమాజం ఎదుర్కుంటున్న సమస్యల్లో ప్రధానమైనది చెత్త.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు.. దీంతో భూమి మొత్తం కలుషితమై పోతున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి హరీశ్రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చెత్తను ఇంటి దగ్గర తడి, పొడి, హానికరమైన చెత్తగా విభజించి వేర్వేరుగా సేకరిస్తున్నది. పట్టణంలో నుంచి సేకరించిన తడి చెత్తను బుస్సాపూర్ బయో ప్లాంట్కు తరలించి, అక్కడ వ్యర్థాలను వేరు చేసి, సీఎన్జీ బయో గ్యాస్ ఉత్పత్తికి తగిన వ్యర్థాలతో గ్యాస్ తయారు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణం నుంచి వచ్చిన వ్యర్థాలను ఆహార, కూరగాయల వ్యర్థాలుగా వేరు చేసి, బయోగ్యాస్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. రోజుకు 8నుంచి 10టన్నుల తడిచెత్తతో 250కిలోల నుంచి 270కిలోల సీఎన్జీ బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గ్యాస్ను సిద్దిపేట పట్టణంలలోని హోటళ్లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని అక్షయ క్యాటరింగ్ వారికి గ్యాస్ను అందిస్తున్నారు. భవిష్యత్లో బయో గ్యాస్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని హోటళ్లకు సీఎన్జీ బయో గ్యాస్ను విక్రయించనున్నారు. ఈ గ్యాస్(క్యాస్కెడ్) సిలిండర్లలో 36 క్యూబిక్ మీటర్ల గ్యాస్ను నింపుతున్నారు. ఈ గ్యాస్ ధర ఒక క్యూబిక్ మీటర్ ధర రూ.36 కాగా, క్యాస్కెడ్ ధర రూ.2800 వరకు వస్తుంది. దీంతో పట్టణం లోని వ్యర్థాలతోనూ ఆదాయ సమకూర్చుకుంటున్నది.
గ్యాస్ తయారీ విధానం ఇలా..
పట్టణం నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు, కూరగాయల వ్యర్థాలను బయో గ్యాస్ ప్లాంట్కు తరలించి, సెగ్రిగేషన్ చేసి బయో గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన వాటిని వినియోగించి ఇతర వ్యర్థాలను సేంద్రియ ఎరువుల కోసం ఉపయోగిస్తున్నారు. చెత్తను అక్కడ వేసిన తర్వాత లోడింగ్ ప్లాట్ఫాంలో వేరు చేసి, స్క్రూగేజీలోకి పంపించి, అక్కడి నుంచి క్రషర్లోకి పంపి, చిన్నచిన్న పీస్లుగా చేసి, ప్రీ డయాస్టర్లోకి పంపి, అక్కడి నుంచి పంపింగ్ చేసి, 10లక్షల లీటర్ల నీటి కెపాసిటీ కల్గిన ప్రధాన డయాస్టర్లోకి పంపిస్తారు. అక్కడ లిక్విడ్ నిల్వ చేసి, అందులోని రాబియో గ్యాస్ను స్టోరేజీలోని రెండు బెలున్లలోకి పంపి, అక్కడ మిథేన్ గ్యాస్ను 50శాతం ప్యూరిఫై చేసిన గ్యాస్ను ప్యూరిఫయర్లో 92శాతం శుద్ధి చేసి, అక్కడి నుంచి వచ్చిన గ్యాస్ క్యారియర్ ద్వారా సిలిండర్లో ఫిల్ చేస్తారు. ఇక్కడ ఉన్న రెండో ప్రాసెసర్లో డయాస్టర్లో నిండిన వాటర్ను స్టోరీ ట్యాంక్లోకి పంపించి, పైప్లైన్ ద్వారా ఎరువులోకి పంపించి, అక్కడ ఆర్గానిక్ స్ప్రే చేసి, ఎరువును జేసీబీల సహాయంతో రోటేషన్ చేసి 60రోజుల పాటు నిల్వ చేసి ఎరువుగా మార్చుతారు. డయాస్టర్లోని వాటర్ను రీసైక్లింగ్ చేసి, ఆ నీటిని ప్లాంట్ అవసరాలకు వాడుతున్నారు.