బొమ్మలు గీయడం అంటే వెన్నతో పెట్టిన విద్య. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఉట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆ విద్యార్థి దిట్ట. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఎంతో మక్కువతో ఎలాంటి శిక్షణ లేకుండానే అబ్బుర పర్చేలా ఎన్నో చిత్రాలు గీస్తున్నాడు. బొల్లారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బిజోయ్ కుమార్ చిత్రలేఖనంలో రాణిస్తూ పోటీల్లోనూ ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్నాడు.
బొల్లారం, మార్చి 18: చిత్రలేఖనంలో ఎన్నో కళాఖండాలు తన చేతి నుంచి జాలువారుతున్నాయి. బొల్లారం మున్సిపల్కు చెందిన విద్యార్థి బిజోయ్కుమార్ ఏ చిత్రం గీసినా అందం ఉట్టిపడుతుంది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, వివేకానందస్వామి, సర్సీవీ రామన్, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శంకరుడు, బొజ్జగణపతి, ప్రకృతి పర్యావరణం, జూనియర్ ఎన్టీఆర్, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారి చిత్రాలు గీయడంలో నేర్పరి. ఈ విద్యార్థిలోని చిత్రకళను గుర్తించిన తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు బిజోయ్కుమార్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండడంలో ఆ రంగంలో మరింత రాణిస్తున్నాడు.
కుటుంబ నేపథ్యం…
నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటలక్ష్మి సుకుమార్ శాశ్మల్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. వీరికి బిజోయ్కుమార్, కూతురు కాబేరి సతానం. ఇద్దరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువులు కొనసాగిస్తున్నారు.
గురువులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం…
విద్యార్థి బిజోయ్కుమార్కు చిత్రాలు గీయడం అంటే ఎంతో ఇష్టం. ఇదే తనలోని చిత్రకారుడిని బయటపెట్టింది. అలవోకగా చూసిన ప్రతి చిత్రాన్ని గీయడం దానికి పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడంతో మరింతగా రాటుతేలాడు. చదువుతో పాటు బొమ్మలు గీయడంలోనూ రాణిస్తున్నాడు. ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్లలో వందల కొద్ది చిత్రాలు వేశాడు. ప్రత్యేక సందర్భాలు, మహనీయుల జయంతి దినోత్సవాలను పురస్కరించుకుని అద్భుతమైన చిత్రాలను గీసి, చూపరులను ఆలోచింపచేస్తాడు. పర్యావరణ పరిరక్షణ, మహిళలపై జరిగే అగాయిత్యాలను కండ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే, సమాజంలో తగిన మార్పును తీసుకురావాలనే సూచనలు చేయించే చిత్రాలు వేశాడు. స్వాతంత్య్ర సమరయోధులు, దేశ నాయకులు, జల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
చిత్రలేఖన పోటీల్లో బహుమతులు…
విద్యార్థి బిజోయ్కుమార్ బాల చిత్రకారుడుగా వివిధ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు సాధించాడు. హెచ్ఎం మంగీలాల్, తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ప్రోత్సహంతో రాష్ట్రస్థాయి హెరిటేజ్ పోటీల్లో పాల్గొని అద్భుత చిత్రాలను గీసి నిర్వాహకుల ప్రశంసలు అందుకొని, ప్రథమ బహుమతి సాధించాడు. గత నవంబర్లో జరిగిన పిల్లల పండుగ వేడుకల్లో అప్పటికప్పుడు ఇచ్చిన అంశంపై అలవోకగా చిత్రాన్ని గీసి ప్రథమ బహుమతి సాధించాడు. చిగురు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. జాతీయ స్థాయి చేతిరాత పోటీల్లోనూ పాల్గొని కలరింగ్లో రాణించి బహుమతులు సాధించాడు. అదేవిధంగా అంతర్జాల చిత్రలేఖన పోటీల్లో పాల్గొంటూ పెక్కు బహుమతులు సాధించి ప్రశంసలు అందుకున్నాడు.
ప్రొఫెషనల్ చిత్రకారుడే లక్ష్యం..
2వ తరగతి నుంచే బొమ్మలు వేయడం నేర్చుకున్నా. మొదటగా దేవుళ్ల బొమ్మలు వేసేవాడిని. తరువాత మహనీయులు, నాయకులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతోమంది చిత్రాలను గీశాను. ఒకవైపు పదో తరగతి చదువును కొనసాగిస్తూ, మరోవైపు తీరిక సమయంలో చిత్రాలు గీస్తున్నాను. బొమ్మలు వేయడం నాకు మానసిక ప్రశాంతతగా ఉంటుంది. ఒక మనషి చెప్పలేని ఎన్నో భావాలు ఒక చిత్రం చెబుతుంది. ప్రొఫెషనల్ చిత్రకారుడిని కావాలన్నదే నా లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల ప్రోత్సహం నన్ను చిత్రకళలో ముందుకు నడుపుతుంది.
– బిజోయ్కుమార్, 10వ తరగతి విద్యార్థి
తోటి విద్యార్థులకు ఆదర్శం..
బిజోయ్కుమార్ గీసిన చిత్రాలు చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. చదువు, చిత్రలేఖనంపై మక్కువతో అనేక పోటీల్లో పాల్గొని పెక్కు బహుమతులు సాధించాడు. ఆ విద్యార్థి కళను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతూనే, చిత్రలేఖనంలో అద్భుతాలను సృష్టిస్తూ అందరిచేత ఔరా అని పించుకుంటూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
– అడ్డాడ శ్రీనివాసరావు, పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు