చేర్యాల, ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సిద్ధమైంది. ఈనెల 15న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారని రైల్వేశాఖ అధికారులు విలేకరులకు తెలిపారు. ఇప్పటికే కొత్తపల్లి-మనోహరాబాద్కు ఉదయం, సాయంత్రం వేళల్లో రైలు ప్రయాణిస్తున్నది. కానీ, కొమురవెల్లిలో మాత్రం రైల్వేస్టేషన్ లేకపోవడంతో మల్లన్న భక్తులకు అసౌకర్యంగా మారింది. రాజస్థ్ధాన్కు చెందిన ఓ బీజేపీ మహిళా నేత ఒకరు కొద్దిరోజుల క్రితం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు.
ఆలయానికి రైల్వేలైన్ ఉండి స్టేషన్ లేకపోవడం ఏమిటని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మల్లన్నను దర్శించుకోవడంతో తనకు మంచి జరిగిందని, రైల్వేబోర్డులో మెంబర్గా ఉన్న తాను ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని ఆమె హామీ ఇచ్చి మంజూరు చేయించారని సమాచారం. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కొమురవెల్లి స్వాగత తోరణం సమీపంలో కొమురవెల్లి ఆలయానికి వచ్చే రహదారి పక్కన రైల్వేస్టేషన్ నిర్మాణానికి ఆశాఖ అధికారులు ఇటీవల స్థలాన్ని ఎంపిక చేశారు. రైల్వేస్టేషన్ నిర్మాణ పనులకు భూమిపూజ నేపథ్యంలో రెండు రోజులుగా స్థలాన్ని చదును చేస్తున్నారు. కొమురవెల్లి క్షేత్రానికి ఇక రైల్వేస్టేషన్ ఏర్పాటు కానుండడం దూరప్రాంత భక్తులకు సౌకర్యంగా మారనున్నది.