సంగారెడ్డి, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : సైన్స్ రంగం లో విప్లవాత్మకమైన మార్పులు దేశంలో చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టిసారించాలని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణా ఎల్లా అన్నారు. ఐఐటీతో పాటు ఇతర విద్యార్థులు సైన్స్ను బ్రహ్మపదార్థంగా చూడటం మానుకోవాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి సైన్స్ను తేలికగా తీసుకుని పరిశోధనలపై దృష్టిపెట్టాలన్నారు. తరగతి గదులు, ప్రసంగాలతో ఆవిష్కరణలు రావని, విద్యార్థులు తమ ప్రతిభతోపాటు నైపుణ్యాలను మెరుగుపర్చకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభకు కల్పనాశక్తిని జోడించినప్పుడే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అవకాశాలు పెరిగాయని, వీటిని అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ వ్యవస్థాపక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఐఐటీ బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ రంగంలో భారతదేశంలో ప్రపంచస్థాయి లో నంబర్వన్ స్థానంలో ఉందని, మొత్తం ప్రపంచానికి భారత్లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లే ఆధారమని అన్నారు.
సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలన్న సంకల్పంతోనే సొంత నిధులతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందించామని తెలిపారు. వ్యాక్సిన్ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే క్లినికిల్ ట్రయల్స్ కీలకం అని, మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. తమ కంపెనీ చికున్గున్యా వ్యాక్సిన్ తీసుకువచ్చేందు కు ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదన్నారు. మనదేశం నుంచి మాలిక్యులర్ వ్యాక్సిన్ రావాలన్నది తన కలగా అభివర్ణించారు. ఎవరూ ఊహించని విధంగా తమ సం స్థ నాజల్ వ్యాక్సిన్ తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కొత్త వ్యాధులను వెంటనే అరికట్టకపోతే అవి మహమ్మారిగా మారే ప్రమా దం ఉందని ఆయన హెచ్చరించారు. 2100 వరకు భారత్ యువశక్తి ఉన్న దేశంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీ విద్యార్థులు ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. 15 ఏండ్లలో ఐఐటీ హైదరాబాద్ ఉన్నతస్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని కృష్ణా ఎల్లా అన్నారు. ఐఐటీ నుంచి 100కు పైగా స్టార్టప్స్ కంపెనీలు రావడంపై అభినందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయరంగం, లైఫ్సైన్సెస్, వ్యాక్సినేషన్పై కృష్ణా ఎల్లా ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఐఐటీ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా ఫ్యూచర్ ఇన్నోవేషన్ ఫెయిర్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు కృష్ణా ఎల్లా, బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి బహుమతులు అందజేశారు. ఐఐటీ హైదరాబాద్ ఐదు వేర్వేరు ఐఎస్వో సర్టిఫికెట్లను సాధించింది. వీటిని ఐఎస్వో సంస్థ ప్రతినిధి ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తికి అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్ 15 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అకడమిక్, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే పేరెన్నిక గల సంస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. మొదటితరం ఐఐటీలు 50 ఏండ్లలో సాధించిన ఫలితాలను ఐఐటీ హైదరాబాద్ 15 ఏండ్లలోనే సాధించిందన్నారు. ఐఐటీ హైదరాబాద్ నుంచి 125 స్టార్టప్ కంపెనీలు రావడంతోపాటు అనేక అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ ఐఐటీ హైదరాబాద్ ఉన్నతస్థాయికి చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.