పల్లెలు ప్రగతికి మల్లెలుగా మారాయి.. తెలంగాణ రాష్ట్రం రాక ముందు సమస్యలకు కేరాఫ్గా మారిన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, పట్టణ ప్రగతితో ఆదర్శవంతంగా మారారి, అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ, జూన్ 13
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన పల్లెలు.., తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతికి చిహ్నాలుగా తీర్చిదిద్దారు. పంచాయతీల అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న సమస్యలు భవిష్యత్లో తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పరిష్కరించారు. వైకుంఠధామాలు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తుండగా, రహదారులు అద్ధంలా మారాయి. పచ్చందాలతో ప్రకృతి వనాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ప్రతి పంచాయతీకో ట్రాక్టర్ ఇలా సకల వసతులతో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛత పరిఢవిల్లుతుండగా, అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ పల్లెలు మురిసిపోతున్నాయి.
ప్రతి పల్లెకూ ఒక పంచాయతీ కార్యదర్శి ప్రతి పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఉత్తమ జీపీలు.. జిల్లాస్థాయి పురస్కారాలకు పంచాయతీలు ఎంపిక ప్రతి ఉదయం 6 గంటలకే పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభం ప్రతి పల్లెలో ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, క్రీడాప్రాంగణాలు
పల్లెప్రగతిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు
మెదక్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించి, జోరుగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రత, స్వచ్ఛతకు పూనుకున్నారు. ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగుకాల్వలు శుభ్రపర్చడం, పరిసరాలను పరిశుభ్రంగా చేయడం, అవెన్యూ ప్లాంటేషన్, వన నర్సరీ, డంపింగ్యార్డుల్లో పిచ్చిమొకలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులు చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులంతా కలిసి సమన్వయంతో పల్లె ప్రగతి కార్యాక్రమాలను విజయవంతం చేస్తున్నారు.
పెరిగిన నిధుల కేటాయింపు, అభివృద్ధి చెందిన గ్రామాలు
సంగారెడ్డి జూన్ 14(నమస్తే తెలంగాణ): ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలోని పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీలకు నిధులు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరినా నాటి పాలకులు పట్టించుకోలేదు. తాగునీటి కోసం ప్రజలు అల్లాడాల్సివచ్చేది. తెలంగాణ ఆవిర్భావం, సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత సంగారెడ్డి జిల్లాలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు అరకొర నిధులతో సతమతమైన పల్లెలు ఇప్పుడు అభివృద్ధిలో సాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన పల్లెప్రగతి కార్యక్రమంతో సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీలు అభివృద్ధి చెందాయి. ఒకప్పుడు తాగునీటి కోసం గోసపడిన పల్లెల్లో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తోంది. పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి పెద్దఎత్తున నిధులు కేటాయించింది. ఈ నిధులతో పల్లెల్లో సీసీరోడ్లు, మురికికాల్వలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, క్రీడాప్రాంగణాలను నిర్మించారు. ప్రతి పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్లు, తాగునీటి సరఫరాకు ట్యాంకర్లు అందజేసింది. ఇదికాకుండా ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలాగే పల్లెలను ప్రభుత్వం పచ్చగా తీర్చిదిద్దింది. పల్లెల్లో హరితహారం ద్వారా మొక్కలు పెంచడంతోపాటు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో 190 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఇందులో 81తండాలను పంచాయతీలుగా మార్చారు.
‘పల్లెప్రగతి’తో మారిన రూపురేఖలు
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మెదక్ జిల్లాలో అన్ని పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో జిల్లాలోని పల్లెలన్నీ యావత్ దేశానికి ఆదర్శగ్రామాలుగా నిలుస్తున్నాయి. పల్లెప్రగతితో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలోని గ్రామాలు పరిశుభ్ర ఆరోగ్య ఆవాసాలుగా రూపాంతరం చెందాయి. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో గుంతలను పూడ్చడం, పిచ్చిమొక్కలను తొలగించడం, పాతబావులను, బొందలను పూడ్చడంతో నీరు నిల్వ ఉండడం లేదు. దీంతో దోమలు తగ్గాయి. గ్రామాల్లో డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు ఎకువగా ప్రబలకుండా పల్లెప్రగతిలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలే కారణం. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, ట్రాలీ ట్యాంకర్లతో కూడిన ట్రాక్టర్లు సమకూర్చడం, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా, విలేజ్ కామన్ డంప్యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది.
అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలు..
పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామ విభాగంలో నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట, శివ్వంపేట మండలం దంతాన్పల్లి, మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ, ఆరోగ్యవంతమైన గ్రామం నర్సాపూర్ మండలం నారాయణ్పూర్, నార్సింగి మండలం పెద్దతండా, పాపన్నపేట మండలం మల్లంపేట, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి, తూప్రాన్ మండలం మల్కాపూర్, చేగుంట మండలం పోతంశెట్పల్లి, నీరు సరిపడా గ్రామం చిలిపిచేడ్ మండలం అంతారం, శివ్వంపేట మండలం శభాష్పల్లి, అల్లాదుర్గం మండలం చేవెళ్ల, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ చేగుంట మండలం చందాయిపేట్, కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి, రామాయంపేట మండలం వెంకటాపూర్ ఆర్, గ్రామంలో స్వయం సమృద్ధిగా మౌలిక సదుపాయాలు మనోహరాబాద్ మండలం మనోహరాబాద్, నిజాంపేట మండలం చల్మెడ, రామాయంపేట మండలం డి.ధర్మారం, సామాజిక భద్రత కలిగిన గ్రామం నార్సింగి మండలం పెద్దతండా, మనోహరాబాద్ మండలం పోతారం, శివ్వంపేట మండలం నవాబ్పేట్, సుపరిపాలన ఉన్న గ్రామం నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి, నార్సింగి మండలం నార్సింగి, చిన్నశంకరంపేట మండలం జంగరాయి, మహిళా-స్నేహపూర్వక పంచాయతీలో మనోహరాబాద్ మండలం గౌతాజీగూడెం, నార్సింగి మండలం వల్లూరు, తూప్రాన్ మండలం మల్కాపూర్ ఎంపికయ్యాయి.
పల్లె ప్రగతి…
మెదక్ జిల్లాలో గతంలో 320 గ్రామ పంచాయతీలు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 469 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇందులో 100శాతం గిరిజనుల జనాభాతో 62తండాలను గ్రామ పంచాయతీలుగా నూతనంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గతంలో ఒక పంచాయతీ కార్యదర్శి 5 నుంచి 6 గ్రామ పంచాయతీలకు ఇన్చార్జిగా ఉండగా, ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించారు. ఇందులోభాగంగా సెప్టెంబర్ 2019 నుంచి నూతనంగా 331 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. గతంలో గ్రామ పంచాయతీలు చాలీచాలని నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేక ఉన్నస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెప్టెంబర్ 2019 నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా కేంద్రం నిధులతో సమానంగా రాష్ట్ర ఆర్థిక నిధులు కలిపి జిల్లాలోని తండా పంచాయతీలతోపాటు అన్ని గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ.6.75 కోట్లు మంజూరవుతున్నాయి.
ఉదయం 6 గంటలకే పారిశుధ్య కార్యక్రమాలు
ఉదయం 6 గంటలకే పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఎకడ నీటి నిల్వలు ఉన్నా మట్టితో పూడ్చడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం, డీసిల్టింగ్ , రోడ్లు, వీధులు ఊడ్చడం, ఇనిస్టిట్యూషన్లు క్లీన్ చేయడం, వాటర్ ట్యాంక్లు శుభ్రపర్చడం, వీధులు, మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ , స్ప్రెయింగ్తోపాటు నీటి గుంటల్లో ఆయిల్బాల్స్ , గంబూషియా చేపలు వేయడం చేస్తున్నారు. డెంగీని అరికట్టే విధంగా ఖాళీ డబ్బాలు, టైర్లు తదితరాలను తొలగిస్తున్నారు.
సర్పంచ్ల ఆధ్వర్యంలో..
పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడుతల పల్లెప్రగతి కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇందులోభాగంగానే గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నారు. 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభించారు. పల్లెప్రగతి కార్యక్రమం 15 రోజులపాటు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. మొదటిరోజు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధాన సమస్యలతోపాటు పల్లె ప్రగతి ప్రాధాన్యతపై గ్రామసభల్లో అవగాహన కల్పిస్తారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజల నుంచి స్పందన వస్తోంది. అయితే ఏళ్లతరబడి పేరుకుపోతున్న చెత్తాచెదారంతోపాటు మురికికాల్వలను శుభ్రం చేయడం, సీసీ రోడ్లను అందంగా ఉంచడం ఇలా అనేక పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు.
అభివృద్ధి పథంలో పల్లెలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పంచాయతీలకు నేరుగా నిధులు చేరేలా చర్యలు తీసుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతినెలా పంచాయతీలకు రూ.10.41 లక్షల నిధులు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లెప్రగతి ప్రారంభం నుంచి ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం రూ.518 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్లు, మురికికాల్వలతోపాటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టారు. ఇవికాకుండా 14వ ఆర్థికసంఘం కింద రూ.76 కోట్లు, 15వ ఆర్థికసంఘం ద్వారా రూ.22.98 కోట్లు, ఎస్ఎఫ్సీ ద్వారా రూ.53కోట్లు నిధులు కేటాయించింది. ఎస్సీకాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.42.84కోట్లు, గిరిజన తండాలు, పంచాయతీల అభివృద్ధి పనుల కోసం రూ.12.50 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అలాగే ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగం ద్వారా మండలకేంద్రాల నుంచి గ్రామాలకు 820 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించారు. రూ.164 కోట్లతో బీటీ రోడ్లనూ నిర్మించింది. గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.138 కోట్లు ఖర్చు చేసింది.
ప్రతి గ్రామంలో నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్యార్డు
పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 647 పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. ప్రతి గ్రామంలో రూ.3 లక్షలకుపైగా నిధులతో ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మించింది. సుమారు రూ.20 కోట్లకుపైగా నిధులతో ప్రభుత్వం 647 వైకుంఠధామాలను నిర్మించింది. నాలుగు నుంచి ఐదు గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ పంచాయతీలను ఏర్పాటు చేసి 86 వైకుంఠ రథాలను, 86 బాడీ ఫ్రీజర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామాల్లో చెత్తసేకరణ కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను సమకూర్చింది. రూ.19 కోట్ల నిధులతో ట్రాక్టర్, ట్రాలీలను అందజేసింది. 647 పంచాయతీల్లో రూ.17.5 కోట్ల నిధులతో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్యార్డులు వేసి వాటిని ఎరువులుగా మార్చుతుంది. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత పెరిగి ప్రజారోగ్యం మెరుగుపడింది. హరితహారంలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. 647 పంచాయతీల్లో 743 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పల్లెల్లో 1917 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. జిల్లాలో 65 బృహత్పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు విడుతలుగా పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టారు.
ఒక్కో కార్మికుడికి రూ.9,500…
నిత్యం గ్రామాల్లో మురుగుకాల్వలను శుభ్రపర్చడంతోపాటు చెత్తను తొలగించి పారిశుధ్య సమస్య నుంచి విముక్తి కలిగిస్తున్నారు. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలతోపాటు పండుగలు, ఇతర సభలు జరిగితే పారిశుధ్య సిబ్బందే చెత్తను తొలగిస్తున్నారు. కరోనా సమయంలో పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రాణాలకు తెగించి పారిశుధ్యం, ఇండ్లు, వీధుల్లో బ్లీచింగ్ , క్లోరినేషన్, మృతదేహాల ఖననం వంటి పనులు చేశారు. దీంతో ప్రజలు ఎలాంటి రోగాలబారిన పడకుండా ఈ సిబ్బంది తమ శ్రమను ధారపోస్తున్నారు. తెల్లవారకముందే లేచి రాత్రి వరకూ పల్లెలు తమ ఇండ్లుగా భావించి పనిచేస్తున్నారు. అలాంటి పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనం పెంచుతూ నిర్ణయించారు. ఒకో పారిశుధ్య కార్మికుడికి రూ.వెయ్యి చొప్పున పెంచుతూ శుభవార్త ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచాయతీల్లో ఒకో కార్మికుడికి నెలకు రూ.8,500 చొప్పున వస్తుండగా.. ఇకపై రూ.9,500 చొప్పున రానున్నాయి. దీంతో కార్మికులకు ఆర్థిక భరోసా లభించనున్నది. కార్మికులు, సంఘాల నుంచి ఎలాంటి వినతులు రాకున్నా సీఎం కేసీఆర్ ఈ వేతన పెంపును చేపట్టడం విశేషం. మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో 1,763 మంది పారిశుధ్య సిబ్బందికి పెరిగిన వేతనం అమలు కానున్నది. దీంతో వేలాదిమంది పంచాయతీ పారిశుధ్య సిబ్బంది కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తమ జీపీలు.. జిల్లాస్థాయి పురస్కారాలకు 27 పంచాయతీలు..
మెదక్ జిల్లాలోని 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. పంచాయతీల పురోగతి, పనితీరు ఆధారంగా వీటిని ఉత్తమ పంచాయతీలుగా ప్రకటించారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలు జిల్లాస్థాయి పోటీలకు అర్హత పొందగా, ఇందులో 27 పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ పంచాయతీలు రాష్ట్రస్థాయి రేసులో నిలవనున్నాయి. ఇందులో ఒక్కో మండలం నుంచి మూడు గ్రామాలు స్థానం దక్కించుకోగా మెదక్, పెద్దశంకరంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ నుంచి ఒక్క గ్రామం కూడా ఎంపిక కాలేదు. చైల్డ్ ఫ్రెండ్లీ, క్లీన్ అండ్ గ్రీన్, హెల్తీ, గుడ్ గవర్నెన్స్, సామాజిక భద్రత, ఉమెన్ ఫ్రెండ్లీ, వాటర్ సఫీషియంట్ తదితర విభాగాల్లో అవార్డులకు ఎంపికయ్యాయి.
ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న అంశాలపై దృష్టి…
జాతీయ పంచాయతీ అవార్డుల ఎంపికలో ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న అంశాలపై దృష్టి సారించారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే అంశంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలకు గతంలోనే శిక్షణ ఇచ్చారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్పీవో, డీపీవో, డిప్యూటీ సీఈవో, సీఈవో తదితరులు అన్ని పంచాయతీల్లో పర్యటించారు. ఒక్కో మండలంలో మెరుగ్గా ఉన్న నాలుగైదు పంచాయతీల నివేదికను అప్లోడ్ చేశారు.
ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంక్…
జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలకు ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డోజర్లు కొనుగోలు చేశారు. దీంతో పారిశుధ్య పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయి. ప్రతి ట్రాక్టర్కు జీపీఎస్ సిస్టం డివైజ్ ఏర్పాటు చేసి తడి, పొడి చెత్త సేకరణ మొకలకు నీరు పోయడం జరుగుతుంది. అన్ని గ్రామ పంచాయతీల్లో డంపు యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం ద్వారా పల్లెల్లో గుణాత్మక మార్పు వచ్చింది. గతంలో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. 97 నూతన గ్రామ పంచాయతీ భవనాలకు రూ.19.40 కోట్ల అంచనాతో మంజూరు చేశారు.
మిషన్భగీరథతో ఇంటింటికీ తాగునీరు
ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాలోని పల్లెప్రజలు తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఉమ్మడిపాలనలో 21వేల తాగునీటి నల్లా కనెక్షన్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సంగారెడ్డి జిల్లాలోని 944 నివాస ప్రాంతాల్లో ఇంటింటికీ రూ.1138 కోట్లతో నల్లా కనెక్షన్ ఇచ్చింది. గ్రామాల్లో 3,103 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్లు ఏర్పాటు చేసి 2,89,262 నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రభుత్వం ప్రతి గ్రామంలో నీటి సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను అందజేసింది. మిషన్భగీరథతో గ్రామాల్లో తాగునీటి సమస్య సమసిపోయింది.